వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించాలి
సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు డిమాండ్
న్యూస్తెలుగు/కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా : బెజ్జూర్ మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన పత్రికా విలేకరుల సమావేశంలో సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ వెనుకబడిన జిల్లాలు మరియు నియోజకవర్గాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అన్ని పథకాలను తమ నియోజకవర్గాలకు మళ్లించుకుంటున్నారని, ఇది అన్యాయమని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని తెలియజేశారు.రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఈ విషయాలన్నీ లేవనెత్తుతామని, అలాగే వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి పై శాసనసభ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తామని అన్నారు. ఈ కమిటీ ఆధ్వర్యంలో వెనకబడిన ప్రాంతాల గుర్తింపు వాటికి అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలపై రిపోర్టు తయారు చేయాలని డిమాండ్ చేస్తామని అన్నారు.బెజ్జూర్ మండలంలో ఉన్న పెండింగ్ సమస్యలైన కరెంటు, తాగునీరు, అటవీ అనుమతులు లేక రహదారుల నిర్మాణంలో జాప్యం కావడం,పోడు భూములు తదితర సమస్యల పై అసెంబ్లీ వేదికగా గళమెత్తుతామని, సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలియజేశారు.పంచాయతీరాజ్ శాఖ మంత్రి గా ఉన్న జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క ఆధ్వర్యంలో జిల్లాలోని వెనుకబడిన కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని పంచాయతీలకు ఒక్క రూపాయి రాకపోవడం సిగ్గుచేటు అని తెలియజేశారు.వెంటనే ప్రజా పనుల కోసం నిధులు విడుదల చేయాలని అన్నారు.బేషరతుగా రుణమాఫీ చేయాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రూ.6800 కోట్ల మాత్రమే కేటాయించి చేతులు దులుపుకోవాలని చూస్తుందని విమర్శించారు.2 లక్షల లోపు రుణం తీసుకున్న ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేయాల్సిందేనని, లేనిపక్షంలో ప్రజాగ్రహానికి గురికావాల్సి వస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. (Story : వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించాలి)
.