ఘనంగా ఖాదర్ బాబా జయంతోత్సవం
విశ్వశాంతికై దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు
న్యూస్తెలుగు/విజయనగరం : సూఫీ సెహన్షా హుజూర్ హజరత్ సయ్యద్ ఖాదర్ ఔలియా ర.ఆ. వారి 128 వ పుట్టిన రోజును పురస్కరించుకుని ఆయన జయంతోత్సవ వేడుకలు బాబామెట్ట ఖాదర్ బాబా దర్గా దర్బార్ షరీఫ్ లో సోమవారం ఘనంగా జరిగాయి. హజరత్ అతావుల్లా షరీఫ్ షా తాజ్ ఖాదరీ బాబా వారి కుమారులు, విజయనగరం ఖాదర్ బాబా దర్గా దర్బార్ షరీఫ్ ముతవల్లి( ధర్మకర్త) డాక్టర్ మొహమ్మద్ ఖలీలుల్లా షరీఫ్ షా తాజ్ ఖాదరీ (ఖలీల్ బాబు) నేతృత్వంలో జరిగిన ఈ వేడుకల్లో చీమలపాడు ఏఏఏంటికే దర్గా దర్బార్ పీఠాధిపతి ముహమ్మద్ ఖ్వాజా మొహియుద్దీన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దర్గాలో ఖురాన్ పఠనంతో జయంతి వేడుకలు మొదలయ్యాయి. రాష్ట్ర నలుమూలల, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు దర్గాలో బాబా వారికి చాదర్ సుగంధ, పరిమళ ద్రవ్యాలు, పూలు, మిఠాయిలు సమర్పించి తమ మొక్కులు చెల్లించకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం మధ్యాహ్నం దర్బార్ లోని లంగర్ ఖనాలో భక్తులకు అన్న సమారాధన నిర్వహించారు. సాయంత్రం దర్బార్ లోని ఖాదర్ బాబా ప్రియ శిష్యులు హజరత్ అతావుల్లా బాబా వారి సన్నిధానం నుంచి చీమలపాడు సూఫీ పీఠాధిపతి ఖ్వాజా మొహియుద్దీన్ షరీఫ్ షా, ఖాదర్ బాబా దర్గా దర్బార్ ముతవల్లి ఖలీలుల్లా షరీఫ్ షా లు భక్తులతో కలిసి డప్పు వాయిద్యాలు, ఫకీర్ మేళాల సందడితో ప్రత్యేక చాదర్, సుగంధ, పరిమళ ద్రవ్యాలు, పూలు, స్వీట్లు పట్టుకుని మెట్టపై ఉన్న దర్గా షరీఫ్ కు ఊరేగింపుగా వెళ్లి ఖాదర్ బాబా వార్కి వాటిని సమర్పించారు. దర్గాలోని బాబా పవిత్ర సన్నిధిలో విశ్వశాంతికై ప్రత్యేక ప్రార్థనలు చేశారు. భక్తులకు ప్రసాదాన్ని పంచిపెట్టారు. అనంతరం దర్బార్ లోని లంగర్ ఖానాలో భారీ అన్న సమారాధనను నిర్వహించి, వేలాదిగా తరలి వచ్చిన భక్తులను సంతుష్టికరమైన అన్న ప్రసాదాన్ని అందించారు. ఈ సందర్భంగా సూఫీ పీఠాధిపతి ఖ్వాజాబాబు సందేశమిస్తూ దేశ సమైక్యతకు, జాతీయ భావనకు, ప్రేమ తత్వానికి, మానవత్వానికి హజరత్ ఖాదర్ బాబా వారు ప్రతీక అని ప్రస్తుతించారు. ప్రజలంతా శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లాలని, సూఫీ సెహన్షా హజరత్ ఖాదర్ బాబా వారి ఆశీర్వచనాలు ప్రతీ ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షిస్తూ ఆశీర్వదించారు. ఈ వేడుకల్లో పలువురు ప్రముఖులు పాల్గొని బాబా వారి సన్నిధిలో ప్రార్థనలు చేశారు. (Story : ఘనంగా ఖాదర్ బాబా జయంతోత్సవం)