వినియోగదారులకు తక్కువ ధరకే నిత్యావసర సరుకులు
జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా
న్యూస్ తెలుగు/విజయవాడ : వినియోగదారులకు తక్కువ ధరకే నిత్యావసర సరుకులను జిల్లాలోని రైతు బజార్లు, హౌల్ సేల్, రిటైల్ దుకాణాల్లో అందుబాటులో ఉంచినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధిమీనా తెలిపారు. జేసీ బుధవారం నందిగామ రైతు బజార్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన అనంతరం ప్రత్యేక కౌంటర్ ద్వారా వినియోగదారులకు తక్కువ ధరకే అందుబాటులో ఉంచిన నిత్యావసర సరుకులను పరిశీలించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ బహిరంగ మార్కెట్లో నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించటంలో భాగంగా జిల్లాలోని అన్ని రైతు బజార్లలో వంట నూనెలు, కందిపప్పు, ఉల్లి, టమాటా అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. మార్కెట్ ధరల కంటే తక్కువ ధరలకే నిత్యావసర సరుకులను వినియోగదారులకు అందిస్తున్నట్లు తెలిపారు. బహిరంగ మార్కెట్లో రూ.125 ధర ఉన్న పాముయిల్ను రూ.110, రూ.135 ధర ఉన్న సన్ ఫ్లవర్ ఆయిల్ను రూ.124, కిలో కందిపప్పు రూ.150, కిలో రూ.47 టమాట అందుబాటులో ఉంచామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని రైతు బజార్లు, సంస్థాగత రిటైల్ దుకాణాల్లో సరసమైన ధరలకు నాణ్యమైన సరకులను వినియోగదారులకు అందించాలన్నదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమన్నారు. ప్రభుత్వం కల్పించిన ఈ సదుపాయాన్ని ప్రతి వినియోగదారుడు వినియోగించుకోవాలని తెలిపారు.(Story : వినియోగదారులకు తక్కువ ధరకే నిత్యావసర సరుకులు)