వంశీతో ములాఖత్ అనంతరం భార్య పంకజశ్రీ
జైల్లో నా భర్తను.. టార్చర్ చేస్తున్నారు..!
కింద పడుకోబెట్టారు..
అనేక రకాలుగా ఇబ్బందులు
మీడియా ముఖంగా దుయ్యబట్టిన పంకజశ్రీ
హైదరాబాద్ వంశీ ఇంట్లో పోలీసులు సోదాలు
సెల్ ఫోన్ కోసం ఆరా
న్యూస్ తెలుగు/అమరావతి: విజయవాడ సబ్ జైల్లో తన భర్త వల్లభనేని వంశీకి తీవ్ర ప్రాణహాని ఉందని మరోసారి ఆయన భార్య పంకజశ్రీ ఆందోళన వ్యక్తం చేశారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో అరెస్టయిన వంశీని విజయవాడ సబ్ జైలుకు తరలించారు. ఈ క్రమంలో ములాఖత్లో భాగంగా భార్య పంకజశ్రీ ఆయనను సబ్ జైల్లో శనివారం కలిశారు. అనంతరం బయటకు వచ్చాక మీడియాతో మాట్లాడుతూ, వంశీకి ప్రాణహాని ఉందని పునరుద్ఘాటించారు. సబ్ జైలులో వంశీని అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారని పేర్కొన్నారు. ఆయన కింద పడుకున్నారని, బెడ్ కావాలని రిక్వెస్ట్ చేస్తామన్నారు. వెన్నుపూస నొప్పితో, శ్వాసకోశ సమస్యతో ఆయన బాధపడుతున్నారని చెప్పారు. అలాంటి వంశీని మానసికంగా కుంగదీస్తున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. వంశీ ఉన్న బారక్లో 60 సీసీ కెమెరాలు పెట్టారని, నా భర్త ఆరోగ్యం బాగుందంటూ డాక్టర్ల చేత తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దీనిపైనా తాను కోర్టును ఆశ్రయిస్తానని చెప్పారు. తప్పుడు కేసులు పెట్టి, రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. టార్చర్తో జైల్లో బంధించి అక్కడ ఆయనను ఎవరూ కలవకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని దుయ్యబట్టారు. మరోవైపు వంశీని 10 రోజుల కస్టడీ కోరుతూ పోలీసులు కోర్టును ఆశ్రయించారు. దీనిపై సోమవారం విచారణకు రానుంది. వంశీ సెల్ఫోన్పైనా పోలీసులు దృష్టి పెట్టారు. ఆయన సెల్ ఫోన్లో కీలక ఆధారాలు ఉన్నట్లు ప్రాథమికంగా కనుగొన్నారు. మరోసారి హైదరాబాద్లోని రాయదుర్గంలోగల వంశీ ఇంటిని విజయవాడ పటమట పోలీసులు తనిఖీలు నిర్వహించారు. దీని కోసం హైదరాబాద్కు రెండు పోలీసు బృందాలు వెళ్లాయి.
ఈ కేసు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. పరారీలో ఉన్న మరికొందరి నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వంశీ ఇంటికి సంబంధించిన వారం రోజుల సీసీ టీవీ విజువల్స్ ను ఏపీ పోలీసులు సేకరించారు. వంశీ ఇంట్లో సెల్ ఫోన్ లభించకపోవడంతో పోలీసులు వెనక్కి తిరిగారు. (Story: జైల్లో నా భర్తను.. టార్చర్ చేస్తున్నారు..!)
Follow the Stories:
రిజిస్ట్రేషన్ శాఖలో డిజిటల్ విప్లవం: లాభమా? నష్టమా?
ఇంటర్ విద్యార్థులకు పండుగలాంటి వార్త!
కల్తీ ఇలా.. కనిపెట్టేది ఎలా..?