దేశాభివృద్ధిలో యువత పాత్ర కీలకం: డా. లక్ష్మయ్య
ఆర్.వి.ఆర్ & జె.సి. ఇంజనీరింగ్ కళాశాలలో
సివిల్స్ ఉచిత శిక్షణ పోస్టర్ ఆవిష్కరణ
బోర్డింగ్, లాడ్జింగ్ సదుపాయాలతో మూడేళ్ల ఉచిత కోచింగ్
న్యూస్ తెలుగు/వినుకొండ : దేశ పాలన, ప్రజా సేవలో సివిల్ సర్వీసెస్ అధికారుల పాత్ర ఎంతో ముఖ్యమని, భారతదేశాన్ని అభివృద్ధి దిశగా అగ్రస్థానంలో నిలిపేందుకు యువత ముందుకు రావాలని ఏపీ వెటర్నరీ కౌన్సిల్ చైర్మన్, డా. లక్ష్మయ్య ఐఏఎస్ అకాడమీ ఫౌండర్ డాక్టర్ లక్ష్మయ్య పిలుపునిచ్చారు. స్థానిక చౌడవరంలోని ఆర్.వి.ఆర్ & జె.సి. ఇంజనీరింగ్ కళాశాలలో కెరీర్ గైడెన్స్ సెల్ ఆధ్వర్యంలో సివిల్ సర్వీసెస్ పోటీ పరీక్షల ఉచిత శిక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన శిక్షణకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మయ్య మాట్లాడుతూ.. డా. లక్ష్మయ్య ఐఏఎస్ అకాడమీ, సీబీఆర్ అకాడమీ మరియు పార్డ్ స్వచ్ఛంద సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ‘పి-4’ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ఈ ప్రత్యేక శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. ఐఏఎస్, ఐపీఎస్ వంటి దేశ అత్యున్నత సర్వీసుల్లో విద్యార్థులు విజయం సాధించేందుకు నాణ్యమైన మార్గదర్శకత్వం, సమగ్ర శిక్షణ అందించడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని ఆయన వివరించారు. దేశ సేవే లక్ష్యంగా పెట్టుకున్న ఎంతోమంది పేద విద్యార్థుల కలలను సాకారం చేయడంలో డా. లక్ష్మయ్య ఐఏఎస్ స్టడీ సర్కిల్ అందిస్తున్న ఈ మూడేళ్ల ఉచిత శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందని సీఐడీ డీఎస్పీ అభిప్రాయపడ్డారు. విద్యార్థులకు పూర్తి ఉచిత కోచింగ్, స్టడీ మెటీరియల్తో పాటు బోర్డింగ్, లాడ్జింగ్ సదుపాయాలు కూడా కల్పిస్తారని ఆయన తెలిపారు. విద్యార్థులు తమ విజ్ఞానాన్ని దేశ సేవకు వినియోగించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని కళాశాల అధ్యక్షులు డా. రాయపాటి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు జాగర్లమూడి మురళీమోహన్, డా. జగదీష్ కె. మద్దినేని ఆకాంక్షించారు. తమ కళాశాల విద్యార్థులకు సివిల్ సర్వీసెస్ కోసం శిక్షణ అందించేందుకు డా. లక్ష్మయ్య ఐ.ఏ.ఎస్ స్టడీ సర్కిల్ ముందుకు రావడం అభినందనీయమని కళాశాల సెక్రటరీ & కరెస్పాండెంట్ రాయపాటి గోపాలకృష్ణ, ట్రెజరర్ డా. కొండబోలు కృష్ణప్రసాద్ కొనియాడారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా. కొల్లా శ్రీనివాస్, అకడమిక్ అండ్ ఆర్&డి డైరెక్టర్ డా. కె. రవీంద్ర, ఫైనాన్స్ & అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ డా. ఎన్.వి. శ్రీనివాసరావు, కెరీర్ గైడెన్స్ సెల్ కన్వీనర్ డా. తారాచంద్, వివిధ శాఖల విభాగాధిపతులు, అధ్యాపక బృందం, మరియు విద్యార్థులు పాల్గొన్నారు.(Story : దేశాభివృద్ధిలో యువత పాత్ర కీలకం: డా. లక్ష్మయ్య )
