దసరా మహోత్సవాలకు సర్వం సిద్ధం
నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్ఎం.ధ్యానచంద్ర
న్యూస్ తెలుగు/విజయవాడ : ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ 3 నుండి 12వ తేదీ వరకు జరిగే దసరా మహోత్సవాలకు నగరపాలక సంస్థ చేయాల్సిన ఏర్పాట్లను సర్వం సిద్ధం చేస్తున్నట్లు నగర పాలక సంస్థ కమిషనర్ హెచ్ఎం.ధ్యానచంద్ర తెలిపారు. నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ చాంబర్లో దసరా ఉత్సవాల ఏర్పాట్లకు సంబంధించి అన్ని శాఖల అధికారులతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దసరా ఉత్సవాలకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా నగరపాలక సంస్థ అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. యాత్రికులకు అవసరమైన తాగునీటి ఏర్పాట్లు, తాత్కాలిక మరుగుదొడ్లు, క్లాక్ రూంలు, పారిశుధ్య నిర్వహణ, గుడి వరకు వెళ్లే రోడ్లకి ప్యాచ్ వర్కులు నిర్వహించి సర్వం సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. శరన్నవరాత్రుల్లో వచ్చే యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 35 లక్షల త్రాగునీటి వాటర్ బాటిల్స్, ప్యాకెట్లు, 150 తాత్కాలిక మరుగుదొడ్లు, 6 క్లాక్ రూమ్లు, 27 ప్రాంతాల్లో 1400 పారిశుధ్య కార్మికులతో మూడు షిప్టుల్లో పారిశుధ్య నిర్వహణ, 24/7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు, యాత్రికులు వెళ్లే గిరి ప్రదక్షిణ దారిలో ప్యాచ్ వర్క్ పనులు నిర్వాహణకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గతంలో లాగానే ఈసారి కూడా భవాని భక్తుల రెడ్ క్లాత్ కొరకు కన్వేయర్ బెల్ట్, 18 ట్రాక్టర్లు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. (Story : దసరా మహోత్సవాలకు సర్వం సిద్ధం)