తెలంగాణ సాయుధ పోరాటం : చరిత్రలో మహోజ్వల ఘట్టం
సిపిఐ జిల్లా కార్యదర్శి విజయరాములు
న్యూస్తెలుగు/వనపర్తి : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం చరిత్రలో మహోజ్వల ఘట్టమని సిపిఐ జిల్లా కార్యదర్శి కే విజయరాములు ఉద్ఘాటించారు. వనపర్తి జిల్లాలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను పానగల్ మండలం కేతేపల్లిలో ప్రారంభించారు. కేతేపల్లి, తెల్లరాల్లపల్లిలో బస్టాండ్లలో అరుణ పతాకాలను ఆవిష్కరించి, నాటి పోరాటయోధులు రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మగ్దుం మహినుద్దీన్, దొడ్డి కొమరయ్య, చాకలి ఐలమ్మ, సోయబుల్లా ఖాన్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి కే విజయరాములు, భారత జాతీయ మహిళా సమాఖ్య ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షరాలు పి.కళావతమ్మ, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కె శ్రీరామ్, మోష, రమేష్, గోపాలకృష్ణ మాట్లాడారు. తెలంగాణ సాయుధ పోరాట యోధుల స్ఫూర్తిని ప్రజల్లో కలిగించేందుకు సెప్టెంబర్ 17వ తేదీ వరకు జిల్లాలోతెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను జరుపుతున్నామన్నారు.భూమి, భుక్తి, బట్టి చాకిరీ నుంచి ముక్తి కోసం సిపిఐ నాయకత్వంలో సాయుధ సంబరం సాగిందన్నారు. నిజాం నవాబు మద్దతుతో ప్రజాకంటకులుగా మారిన భూస్వాములు దొరలు జాగీరుదారులు, దేశముఖ్లను కమ్యూనిస్టులు గ్రామాల నుంచి తరిమికొట్టారన్నారు. 3000 గ్రామాలను విముక్తం చేసి, 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచారన్నారు. ఈ పోరాటంలో 4500 మంది కమ్యూనిస్టు యోధులు అమరులయ్యారన్నారు. నిజాముకు వ్యతిరేకంగా పేదలు రైతులు సాగించిన పోరాటాన్ని బిజెపి హిందూ ముస్లిం పోరాటంగా వక్రీకరించే కుట్ర చేస్తుందని విమర్శించారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా మగ్దుం మైనుద్దీన్, షేక్ బందగి, సోయబుల్లా ఖాన్ వంటి ముస్లిం నేతలుపోరాడారని గుర్తు చేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ వల్ల తెలంగాణ భారత్లో విలీనమైందని బిజెపి చరిత్రను వక్రీకరిస్తోందన్నారు. ఆనాడు తెలంగాణలో బిజెపి ఉనికే లేదని, ఆనాటి ప్రజా వ్యతిరేకులైన భూస్వాములవారతులు ఇప్పుడు బిజెపిలో ఉన్నారన్నారు. కమ్యూనిస్టుల పోరాటం ఫలితంగానే పేదలకు అభివృద్ధి సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. నాటి అమరుల త్యాగాలను ఆశలను నెరవేర్చటలో బిజెపి బీఆర్ఎస్ ప్రభుత్వాలు విఫలమయ్యాయని, ప్రజల సంక్షేమం చూడకుంటే కాంగ్రెస్కు అదే గతి పడుతుందన్నారు. సాయుధ తెలంగాణ అమరుల పోరాట స్ఫూర్తితో ప్రజల పక్షాన సిపిఐ పోరాడుతోందని, గ్రామాల్లో ప్రజలు ఎర్రజెండా నీడన సంఘటితం కావాలన్నారు. నాయకులు కళావతమ్మ, శ్రీరామ్, రమేష్, గోపాలకృష్ణ, మోష, కాకం బాలస్వామి, డంగు కుర్మయ్య, పెంటయ్య, శివకుమార్, కాకం చిన్న నారాయణ, కాశన్న, లక్ష్మీనారాయణ,కుర్వ హనుమంతు, చిన్న కుర్మయ్య, సంతోష్, రామాంజనేయులు, సహదేవ్, ఎర్రగుంట రాముడు, పరశురాముడు, హుస్సేన్ పాల్గొన్నారు.