ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించడంలో మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకం
న్యూస్ తెలుగు/వనపర్తి : ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించడంలో మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకమని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు.కలెక్టరేట్లోని సమావేశ మందిరం లో గురువారం మైక్రో అబ్జర్వర్లకు నిర్వహించిన శిక్షణకు ఎన్నికల సాధారణ పరిశీలకులు మల్లయ్య భట్టు, వ్యయ పరిశీలకులు శ్రీనివాస్, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య తో కలిసి పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికలు స్వేచ్ఛయుత వాతావరణంలో నిర్వహించడంలో మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకమని అన్నారు. మైక్రో అబ్జర్వర్లు పోలింగ్ ప్రక్రియను పరిశీలన చేయడమే కీలకమని, అలాకాకుండా పిఓలు ఏపీఓల విధుల్లో జోక్యం చేసుకోరాదని చెప్పారు. పోలింగ్ ప్రక్రియ ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం జరుగుతుందా లేదా పరిశీలన చేయడం మైక్రో అబ్జర్వర్ల ప్రధాన బాధ్యత అన్నారు. గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ నిర్వహణలో ఏమైనా సమస్యలు ఉంటే అబ్జర్వర్లకు తెలియజేయాల్సిన బాధ్యత మైక్రో అబ్జర్వర్లపై ఉంటుందన్నారు. మైక్రో అబ్జర్వర్లు పోలింగ్ విధానాన్ని పరిశీలిస్తూ ఎలాంటి తప్పిదాలు ఉల్లంఘనలు జరిగిన ఎన్నికల పరిశీలకుల దృష్టికి తీసుకుపోవాలన్నారు. పోలింగ్ విధానాన్ని నిశితంగా పరిశీలించి మైక్రో అబ్జర్వర్లకు ఇచ్చిన ఫార్మట్లోనే నివేదిక సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. పోలింగ్ రోజున ఉదయం 6:00 కల్లా మైక్రో అబ్జర్వర్లు నిర్దేశించిన పోలింగ్ కేంద్రానికి చేరుకోవాలని కలెక్టర్ సూచించారు. మైక్రో అబ్జర్వర్లు తాము ఫిల్ చేయాల్సిన చెక్ లిస్ట్ ను చాలా జాగ్రత్తగా పూర్తి చేయాలని సూచించారు. మైక్రో అబ్జర్వర్ పరిధిలో ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఉంటే అన్ని చెక్ లిస్ట్ లు సమర్పించాల్సి ఉంటుందని తెలియజేశారు. ఎన్నికల సాధారణ పరిశీలకులు మల్లయ్య బట్టు మాట్లాడుతూ పోలింగ్ ప్రక్రియ నిర్వహణలో మైక్రో అబ్జర్వర్లు ఎన్నికల కమిషన్ తరఫున కళ్ళు చెవుల లాగా పనిచేయాలని సూచించారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికల పోలింగ్ నిర్వహణకు మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకమని పరిశీలకులు తెలియజేశారు. సమావేశంలో లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ శివకుమార్, ట్రైనర్ శ్రీనివాసులు, డిప్యూటీ సీఈఓ రామ మహేశ్వర్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.(Story : ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించడంలో మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకం )

