నేడు నాటిన మొక్కే, రేపు పర్యావరణ పరిరక్షణ కవచం
నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి
న్యూస్ తెలుగు/విజయవాడ : కాలుష్యం నుండి మనల్ని మనం కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని, ఈరోజు నాటిన మొక్కే రేపు మనల్ని రక్షణ కవచంగా మారుస్తుందని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. స్వచ్ఛతాహి సేవా కార్యక్రమంలో భాగంగా నగరంలో ఉన్న అన్ని వార్డుల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. అందులో భాగంగా 46వ డివిజన్లో పాల ఫ్యాక్టరీ వద్ద మేయర్ బుధవారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అమ్మ కోసం మొక్కలను నాటే కార్యక్రమం నిత్యం జరుగుతూ ఉండాలని, పర్యావరణ పరిరక్షణకు ఇలాంటి కార్యక్రమాల వల్ల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. మొక్కలను నాటడమే కాకుండా వాటి సంరక్షణ కూడా చూసుకోవాల్సిన బాధ్యత నాటిన వాళ్ళదేనని, వాటికి నీరు పోస్తూ ఆ మొక్క మహావృక్షమై పర్యావరణాన్ని రక్షించే పర్యావరణ కవచంగా మారాలన్నారు. నగర పాలక సంస్థ పరిధిలో తరచుగా మొక్కలను నాటే కార్యక్రమం చేపడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటూ సుస్థిరాభివృద్ధికి అడుగులు వేస్తోందని తెలిపారు. అమ్మ కోసం ఒక మొక్కని నాటితే, ఆ మొక్క అమ్మ వలె తిరిగి మనల్ని సంరక్షిస్తుందని, తల్లి ఒక బిడ్డని సంరక్షించుకునే విధంగా, ఆ మొక్క మనల్ని కాలుష్యం నుండి రక్షిస్తుందని తెలిపారు. సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు జరిగే స్వచ్ఛత హి సేవ కార్యక్రమాల్లో ప్రజలందరూ భాగస్వాములై పర్యావరణ పరిరక్షణకు, నగరపాలక సంస్థను స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డుల్లో ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేయాలని పిలపునిచ్చారు. (Story : నేడు నాటిన మొక్కే, రేపు పర్యావరణ పరిరక్షణ కవచం)