గిరిజన గ్రామాల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి
న్యూస్ తెలుగు /సాలూరు/ (పార్వతీపురం మన్యం) : మారుమూల గిరిజన గ్రామాల ఆరోగ్యం పట్ల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ టి. జగన్మోహన్ రావు అన్నారు. ఈ మేరకు డిపిఎంఓ డాక్టర్ రఘుకుమార్ తో కలసి పెద్దవలస, తాడిలోవ, దిగువ దాగరవలస గ్రామాలను ఆదివారం సందర్శించారు. అక్కడ గ్రామస్తులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలపై అడిగి తెలుసుకున్నారు. మాతా శిశు సంక్షేమ కార్డులో గర్భిణీల,శిశువుల ఆరోగ్య తనిఖీల వివరాలు పరిసీలించి తగు సూచనలు చేశారు.పౌష్టికాహారం గర్భిణీలు వినియోగించుకునేలా పర్యవేక్షణ చేయాలని అంగన్వాడీ సిబ్బందికి సూచించారు. ఆరోగ్య కేంద్రాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు వారికి ఏ మేరకు దూరంలో ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. అలాగే ప్రతి నెలావ్ వైద్య శిబిరాలు గ్రామంలో నిర్వహిస్తున్నారా, ప్రస్తుతం గ్రామంలో ఆరోగ్య పరిస్థితులపై తెలుసుకున్నారు. గర్భిణీలు, బాలింతలు, ఐదేళ్లలో పిల్లలు, బాలికలలో రక్తహీనతతో ఉన్నవారిని గుర్తించారా అని సిబ్బందిని ఆరా తీశారు.ఐరన్ ఫోలిక్ యాసిడ్ మాత్రలు, సిరప్స్ నిర్దేశించిన మోతాదులో సకాలంలో వేయించాలని, హైరిస్క్ సమస్యలను గుర్తించాలని ఆదేశించారు. గ్రామంలో జ్వరాలు,సీజనల్ వ్యాధుల ప్రభావం గురించి తెలుసుకొని జ్వర లక్షణాలతో ఉన్న ఇద్దరి పిల్లల ఆరోగ్య స్థితి పరిశీలించారు. నిర్ధారణ పరీక్షలు,మందులు వైద్య సిబ్బంది వద్ద అందుబాటులో ఉంచాలన్నారు. గ్రామస్తులకు పలు ఆరోగ్యపరమైన అంశాలపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డా. రవికిరణ్, సూపర్వైజర్స్ నాగేంద్ర, సతీష్,వైద్య సిబ్బంది తదితరులు ఉన్నారు. (Story : గిరిజన గ్రామాల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి)