సాయుధ పోరాటాన్నివక్రీకరించేందుకు
బిజెపి కుట్ర: సిపిఐ
న్యూస్తెలుగు/వనపర్తి: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని వక్రీకరించేందుకు బిజెపి కుట్ర చేస్తోందని, తిప్పి కొట్టాలని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి రమేశ్ పిలుపునిచ్చారు. వనపర్తి అంబేద్కర్ చౌక్ లో సిపిఐ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు చిట్యాల ఐలమ్మ 40వ వర్ధంతిని నిర్వహించారు. చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ కార్యదర్శి రమేశ్, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీరామ్, సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి గోపాలకృష్ణ మాట్లాడారు. నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల, దొరలు భూస్వాముల పీడనం నుంచి ప్రజల విముక్తి కోసం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం సిపిఐ ఆధ్వర్యంలో జరిగింది అన్నారు. దొరల దౌర్జన్యం ఆగడాలకు వ్యతిరేకంగా చిట్యాల ఐలమ్మ సిపిఐ లో చేరి ప్రజల పక్షాన పోరాటం చేసిందన్నారు. 3000 గ్రామాలను దొరల నుంచి విముక్తి చేసి, పది లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచిన ఘన చరిత్ర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి ఉందన్నారు. పోరాటంలో 4,500 మంది కమ్యూనిస్టు వీరులు అమరులయ్యారన్నారు. భూమి భుక్తి విముక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని, బిజెపి హిందూ- ముస్లిం పోరాటంగా చిత్రీకరించే కుట్ర చేస్తోందన్నారు. ప్రజలకు అబద్ధాలు చెప్పి నమ్మించేందుకు ఆపసోపాలు పడుతుందన్నారు. ప్రజలు తిప్పి కొట్టాలన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి అసలైన వారసులు కమ్యూనిస్టులు మాత్రమే అన్నారు. జిల్లా కార్యవర్గ సభ్యులు కళావతమ్మ,శ్రీరామ్, ఎర్ర కురుమయ్య,రమణ, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు మహేష్, ఏఐఎస్ఎఫ్ డివిజన్ కార్యదర్శి వంశీ, ఎన్ఎఫ్ఐ డబ్ల్యు పట్టణ కన్వీనర్ జయమ్మ, కో కన్వీనర్లు శిరీష,శ్రీదేవి, భూమిక,మహిళా నేతలు వెంకటమ్మ, జ్యోతి, సుప్రియ తదితరులు పాల్గొన్నారు.(Story:సాయుధ పోరాటాన్నివక్రీకరించేందుకు బిజెపి కుట్ర: సిపిఐ)

