పాత బిల్లులు చెల్లిస్తున్న కూటమి ప్రభుత్వం
న్యూస్ తెలుగు /వినుకొండ : అభివృద్ధి పనులు చేసి బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్న వారికి పాత బిల్లులు చెల్లించి ఆదుకునేందుకు నిర్ణయం తీసుకున్న మంచి ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. ఎంఎన్ఆర్ఇజిఎస్ అధికారులు సిబ్బందితో బుధవారం ఉదయం చీఫ్ విప్ కార్యాలయంలో జరిగిన సమావేశానికి ముఖ్యఅతిథిగా చీఫ్ విప్ జీవి పాల్గొని మాట్లాడారు. 2014-2019 మధ్యకాలంలో సిమెంట్ రోడ్లు, సైడ్ కాలువలు, కల్వర్టులు, డంపింగ్ యార్డులు, గోకుల షెడ్లు పలు అభివృద్ధి పనులు చేసినవారికి అరాచక వైసిపి ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో బిల్లులు చెల్లించకపోవడంతో ఆర్థికంగా నష్టపోయి అనేక ఇబ్బందులు పడ్డారని తెలిపారు. వారి కష్టాలను నష్టాలను తెలుసుకున్న సీఎం చంద్రబాబు నాయుడు స్పందించి పాత బిల్లులు చెల్లించేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. పాత బిల్లులు చెల్లించుటకు వెంటనే వాటి వివరాలు పంపవలసిందిగా ప్రభుత్వం ఆదేశించినట్టు వివరించారు. పల్నాడు జిల్లాలో మొత్తం 3904 పనులకు 80 కోట్లకు పైగా బిల్లులు చెల్లించాల్సి ఉందని, వినుకొండ నియోజకవర్గం లో జరిగిన 1054 పనులకు సంబంధించి 26 కోట్ల 72 లక్షల బిల్లులు చెల్లించాల్సి ఉందన్నారు. ప్రభుత్వ ఆదేశానుసారం బిల్లులు రావలసిన వారు ఆయా మండలాల పంచాయతీరాజ్ ఏఈ, ఎంఎన్ఆర్ఇజిఎస్ ఏపీవో లను సంప్రదించి చేసిన వర్క్ ఐడి నెంబర్ పెండింగ్ బిల్లు లిస్టులో పరిశీలించి లిస్టులో లేనియెడల వెంటనే నమోదు చేయించుకోవాల్సిందిగా చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు కోరారు. సమావేశానికి పలనాడు జిల్లా ద్వామ పిడి సిద్ధ. లింగమూర్తి, ఏపీడి బూసిరెడ్డి, ఎంఎన్ఆర్ఇజిఎస్ సిబ్బంది, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు, బ్లెండర్లు పాల్గొన్నారు. (Story:పాత బిల్లులు చెల్లిస్తున్న కూటమి ప్రభుత్వం)

