యువతను ఆకట్టుకునే విధంగా సిపిఐ ముందుకు సాగాలి
న్యూస్ తెలుగు/వినుకొండ : భారత కమ్యూనిస్టు పార్టీ దేశవ్యాప్తంగా 100 ఏళ్ళు శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న నేపథ్యంలో పౌరుషాలకు మారుపేరైన పల్నాడు జిల్లా సిపిఐ రెండవ మహాసభలు వినుకొండలో నిర్వహించుకోవడం అభినందనీయమని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు అన్నారు. రెండవ రోజు ప్రతినిధుల మహాసభ సందర్భంగా ముందుగా విలేకరుల సమావేశంలో ముప్పాళ్ళ మాట్లాడారు. 28వ సిపిఐ రాష్ట్ర మహాసభలు ఒంగోలులో ఈనెల 23వ తేదీ నుండి ప్రారంభమవుతాయని, ఇదే హుషారు, ఇదే చైతన్యంతో ఒంగోలు రాష్ట్ర మహాసభలకు పల్నాడు జిల్లా నుండి పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. భారత కమ్యూనిస్టు పార్టీకి ఎంతో ఉద్యమ చరిత్ర ఉందని, పెట్టుబడిదారీ వ్యవస్థపై నిరంతరం పోరాటం సాగిస్తూనే ఉన్నదన్నారు. 140 కోట్ల దేశ ప్రజల సంపదను ప్రధాన మోడీ ఆయన అనుచరులకు దోచి పెడుతున్నారన్నారు. ఇది అన్ని వర్గాల ప్రజలను మోసం చేయడమే అన్నారు. అభ్యుదయ వాదులంతా అంబేద్కర్ రాజ్యాంగాన్ని గౌరవిస్తుంటే, మోడీ ప్రభుత్వం ఒక దశలో అపహాస్యం చేస్తుందన్నారు. లౌకిక వ్యవస్థను కాపాడేందుకు వామపక్ష ఐక్యత ఎంతో అవసరమన్నారు. దేశ ప్రజలకు మోడీ, ట్రంప్ శని గ్రహాలుగా మారారన్నారు. లక్షల కోట్లు పెద్దలకు గుమ్మరిస్తూ పేదలకు బిక్షం పెడుతున్నారు అన్నారు. ఆనాడు స్మార్ట్ మీటర్ల పై వ్యతిరేకించిన చంద్రబాబు, నేడు నోరు మెదపడం లేదని, స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా సిపిఐ ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తుందన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జల్లి విల్సన్, సిపిఐ గుంటూరు జిల్లా కార్యదర్శి, కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్, పల్నాడు జిల్లా సిపిఐ కార్యదర్శి ఏ. మారుతి వరప్రసాద్ పాల్గొన్నారు.(Story :యువతను ఆకట్టుకునే విధంగా సిపిఐ ముందుకు సాగాలి )

