గణప సముద్రం రిజర్వాయర్ నిర్మాణానికి రైతులు పెద్ద మనసుతో సహకరించాలి
న్యూస్తెలుగు/వనపర్తి: గణప సముద్రం రిజర్వాయర్ నిర్మాణానికి రైతులు పెద్ద మనసుతో సహకరించాలని వనపర్తి రెవెన్యూ డివిజనల్ అధికారి సుబ్రహ్మణ్యం కోరారు. శుక్రవారం ఘనపూర్ మండలంలోని రైతు వేదికలో ఇరిగేషన్ అధికారి, సర్వేయర్ తో కలిసి గణప సముద్రం రిజర్వాయర్ లో భూములు కోల్పోతున్న రైతులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణప సముద్రం రిజర్వాయర్ పూర్తి నిర్మాణానికి 603.46 ఎకరాల భూమి అవసరం ఉన్నదని ఇందులో 388 ఎకరాలు గణప సముద్రం చెరువు లోపల శిఖం పట్టాలు ఉన్నట్లు తెలిపారు. శిఖం పట్టాలు కలిగిన వారు చెరువులో నీరు లేనప్పుడు మాత్రమే ఒక పంట వేసుకోడానికి అవకాశం ఉంటుంది. మొత్తం 603.46 ఎకరాల్లో 991 మంది రైతులు ఉండగా ఇప్పటికే 251 మంది రైతులు భూమి ఇచ్చేందుకు అంగీకారం తెలిపి అవార్డులు తీసుకోవడం జరిగింది. మిగిలిన 740 మంది రైతులు సైతం అంగీకరిస్తే గణప సముద్రం రిజర్వాయర్ పూర్తి అవుతుందని తద్వారా 5200 ఎకరాలకు సాగు నీరు అందించవచ్చన్నారు. ఘనపూర్ మండలం తో పాటు నిజాలపూర్, ముసాపేట, ముహమ్మద్ ఖాన్ పల్లి గ్రామాల రైతులకు సాగునీరు అందుతుంది. (Story:గణప సముద్రం రిజర్వాయర్ నిర్మాణానికి రైతులు పెద్ద మనసుతో సహకరించాలి)

