శివశక్తి ఫౌండేషన్ వారి సివిల్స్ ఉచిత శిక్షణకు 13 మంది అభ్యర్థుల ఎంపిక
మహిళా అభ్యర్థులను అభినందించిన చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు
న్యూస్ తెలుగు / వినుకొండ : ముందుగా, ప్రకటించినట్లుగా ఆదివారం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఆధారంగా సివిల్స్ ఉచిత శిక్షణకు అభ్యర్థులను ఎంపిక చేసినట్లు ప్రభుత్వ చీఫ్విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తెలిపారు. ఈ మేరకు అర్హత సాధించిన 13 మందిని సోమవారం వినుకొండలోని చీఫ్ విప్ క్యాంపు కార్యాలయంలో అభినందించి సన్మానం చేశారు. ఈ సందర్బంగా చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ. మంచి లక్ష్యం కోసం కలసి వస్తున్న లక్ష్మయ్య ఐఏఎస్ స్టడీ సర్కిల్ అధినేత డా. లక్ష్మయ్యను ప్రత్యేకంగా అభినందిస్తున్నామన్నారు. ఎంపికైన వారికి శిక్షణ పరంగా వారు చూసుకుంటున్నారని, వసతి, భోజనం శివశక్తి ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేస్తున్నామన్నారు. గతంలో లక్ష్మయ్య వద్ద సివిల్స్, గ్రూప్స్ శిక్షణ తీసుకున్న అనేకమంది ఉన్నతస్థానాల్లో స్థిరపడ్డారని అదేబాటలో కొత్తవారు కూడా నడవాలన్నదే తన ఆకాంక్షగా తెలిపారు. శివశక్తి ఫౌండేషన్ ద్వారా సహకారం తీసుకునే వారు మళ్లీ ఈ సమాజానికి ఉపయోగపడాలనేది తన కోరిక అన్నారు. జీవితాల్లో స్థిరపడిన తర్వాత ఆదాయంలో కొంత సమాజ సేవకు ఇవ్వడం, నిజా యతీగా ఉండడం, ఇతరులకు సహాయకారిగా ఉండడం ముఖ్యమన్నారు. ఇప్పుడు చేర్చుకుంటున్న వారికి మళ్లీ 6 నెలలు, ఏడాదికి పరీక్షలు ఉంటాయని, ప్రతిభఆధారంగానే కొనసాగింపు ఇస్తామన్నారు. ఎక్కడ ఉన్నా మంచి వ్యక్తిత్వంలో 13 మందికి సేవచేసేలా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐఏఎస్ స్టడీ సర్కిల్ డా. పారా లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.(Story:శివశక్తి ఫౌండేషన్ వారి సివిల్స్ ఉచిత శిక్షణకు 13 మంది అభ్యర్థుల ఎంపిక)

