చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నికల్లో విజయకేతనం
ఒక్కొక్కటీ కూటమి పరం
మున్సిపల్ పీఠాలపై కూటమి గురి
వైఎస్ఆర్సీపీ డీలా
బెజవాడ పైనా కన్ను
న్యూస్ తెలుగు/అమరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మున్సిపల్ బైపోల్ ఫీవర్ వణికిస్తోంది. అధికారం కోల్పోయాక ఒక్కొక్క నగర కార్పొరేషన్, మున్సిపాల్టీల పీఠాలు వైఎస్ఆర్సీపీ నుంచి దూరమవుతున్నాయి. ఇటీవల జరిగిన కార్పొరేషన్ డిప్యూటీ మేయర్, మున్సిపల్ వైస్ చైర్మన్ల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులే హవా సాధించారు. ఇక చేసేదేమీ లేక..ఉన్న కార్పొరేటర్లు, కౌన్సిలర్లను చక్కదిద్దుకునే పనిలో వైసీపీ ఉంది. గత వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో రెండు మున్సిపాల్టీలు మినహా అన్ని కార్పొరేషన్లు, మున్సిపాల్టీలను వైఎస్ఆర్సీపీ వశమయ్యాయి. అప్పట్లో ప్రభుత్వం కార్పొరేషన్లో ఇద్దరు డిప్యూటీ మేయర్లు, మున్సిపాల్టీల్లో ఇద్దరు వైస్ చైర్మన్ల విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ పదవులు నాలుగేళ్లపాటు ఉండేలా ప్రత్యేకంగా చట్టం తీసుకొచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో చాలా మంది కార్పొరేటర్లు, కౌన్సిలర్లు వైఎస్ఆర్సీపీని వీడారు. దీంతో ఎక్కడికక్కడే కూటమి బలం పెరగగా, వైఎస్ఆర్సీపీ బలహీనమైంది. అలా ఉన్న చోటల్లా కార్పొరేషన్లు, చైర్మన్లను కైవసం చేసుకునేందుకు కూటమి పార్టీలు ముమ్మర ప్రయత్నాలు ప్రారంభించారు. ఇటీవల జరిగిన తిరుపతి డిప్యూటీ మేయర్, నందిగామ మున్సిపల్ చైర్మన్ తదితర ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. కాకినాడ జిల్లా తుని, పల్నాడుజిల్లా పిడుగురాళ్ల మున్సిపాల్టీలతోపాటు పార్వతీపురం మన్యంజిల్లా పాలకొండ నగర పంచాయతీలో ఒక్కో వైస్ చైర్మన్ పదవికి ఎన్నికలు నిర్వహించారు. ఈ మూడు మున్సిపాల్టీల్లో ఈనెల 3వ తేదీన ప్రత్యేక సమావేశం నిర్వహించినప్పటికీ, వివిధ కారణాల వల్ల వాయిదా పడ్డాయి. ఈ క్రమంలో అక్కడ ఎన్నికల నిర్వహణకుగాను రాష్ట్ర ఎన్నికల కమిషన్ నీలం సాహ్ని మళ్లీ ఆదేశించారు. పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ చైర్మన్ను టీడీపీ కైవసం చేసుకుంది. కౌన్సిలర్లు అందరూ వైస్ చైర్మన్గా ఉన్న భారతీని ఎన్నుకున్నారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి కౌన్సిలర్ రమాదేవిని పోటీలో ఉంచినా ఫలితం దక్కలేదు. ఇందులో తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక మంగళవారం జరగనుంది. ఈ సందర్భంగా వైసీపీ నేతలు చలో తునికి పిలుపునీయడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. వైసీపీ నేతలు జక్కంపూడి రాజా, మార్గాని భరత్, మాజీ మంత్రి చెన్నబోయిన వేణుగోపాల కృష్ణ ఇంటి ఎదుట పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. తుని వెళ్లకుండా పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్తతకు దారితీసింది.
వైఎస్ఆర్సీకి బలం తగ్గుతోందా?
కార్పొరేషన్, మున్సిపాల్టీల పీఠాలను క్రమంగా కూటమి వశం కావడంతో వైఎస్ఆర్సీపీకి స్థానికంగా బలం తగ్గుతోంది. జగన్ అధికారంలో ఉన్నంత వరకు అంటిపెట్టుకుని ఉన్న కార్పొరేటర్లు, కౌన్సిలర్లు వరుసగా జారుకుంటున్నారు. అది ప్రలోభాలు అవ్వొచ్చు..పదవులు కావొచ్చు..ఏదైనా సరే సొంత పార్టీ నుంచి గెలిచిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు నిలవలేకపోతున్నారు. స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులతో సఖ్యత లేకపోవడం, జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లపాటు వారిని ఆదరించకపోవడం వెరసి వైఎస్ఆర్సీపీని వీడుతున్నారు. ఈ చర్యలతో ఆ పార్టీలో ఆందోళన నెలకొంది. అత్యధికంగా టీడీపీ వైపే వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు మొగ్గుచూపుతున్నారు. దీన్ని గుర్తించిన పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాల వారీగా కార్పొరేటర్లు, మున్సిపల్ కౌన్సిలర్లతో సమావేశాలు నిర్వహించి..దిశా నిర్దేశం చేశారు. అయినా ఎక్కడా కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఆగడంలేదు. కూటమి ఆకర్షణకు వరుసగా క్యూ కడుతున్నారు. గుంటూరు కార్పొరేషన్కు జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులే విజయం సాధించారు. అక్కడ వైఎస్ఆర్సీపీకి మెజారిటీ కార్పొరేటర్లు ఉన్నప్పటికీ, భిన్నంగా ఫలితాలు వస్తున్నాయి. దీని ఆధారంగా పేరుకే వారు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు అయినా, కూటమికే మద్దతిచ్చేలా చివరి నిమిషంలో మారిపోతున్నారు. ఈ పరిణామాలతో వైఎస్ఆర్సీపీకి దిక్కుతోచడంలేదు.
విజయవాడ కార్పొరేషన్పైనా టీడీపీ కన్ను!
రాష్ట్ర నడిబొడ్డున ఉన్న విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పీఠంపైనా టీడీపీ కన్నువేసింది. ఇప్పటికే 12 మంది వరకు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు కూటమి గూటికి చేరువయ్యారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో విజయవాడ పశ్చిమ, సెంట్రల్, తూర్పు నియోజకవర్గాలకు చెందిన దాదాపు 12 మందికిపైగా కార్పొరేటర్లు సొంత వైఎస్ఆర్సీపీకి చేయకుండా మౌనంగా ఉండిపోయారు. వారంతా లోపాయికారిగా బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి గెలుపునకు కృషి చేశారన్న ప్రచారముంది. ఎన్నికల సమయంలోనే వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ విజయ్కుమార్ బీజేపీలో చేరారు. అప్పటి నుంచి నెలకొన్న పార్టీలోని అసమ్మతిరాగం..కాస్తా ఎన్నికల అనంతరం వరకు కొనసాగుతోంది. ఇటీవల విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్పై జగన్ నిర్వహించిన సమావేశానికి వారంతా డుమ్మా కొట్టారు. విజయవాడ కార్పొరేషన్లో వైఎస్ఆర్సీపీకి పూర్తి స్థాయి బలం ఉంది. దీన్ని గుర్తించిన కూటమి పార్టీలు విజయవాడను కైవసం చేసుకునేందుకు పావులు కదుపుతున్నట్లుగా ప్రచారముంది. అదే జరిగితే విజయవాడ కార్పొరేషన్ కూటమి పరం కానుంది. ఇలా ప్రధాన నగరాలు, మున్సిపాల్టీలు ఒక్కొక్కటిగా కూటమి అభ్యర్థులను పోటీలోకి దించి, తమ పార్టీ బలాన్ని పెంచుకుంటోంది. ఫలితంగా వైఎస్ఆర్సీపీ చట్టసభలతోపాటు స్థానిక సంస్థల్లోను బలహీనంగా మారుతోంది. రాబోయే రోజుల్లో జగన్ సొంత గడ్డయిన పులివెందుల మున్సిపాల్టీకి ఉప ఎన్నికలు వచ్చే పరిస్థితులు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. (Story: మున్సిపల్ పీఠాలపై కూటమి గురి)
Follow the Stories:
జగన్ సెల్ఫీ కోసం ఏడ్చిన చిన్నారి! (Lovely Photos)
వింతైన రూపం..ఈ చెట్టుకు సొంతం!
దొంగలు పారిపోయారని జైలునే మూసేశారు!
వణికిస్తున్న కొత్త వైరస్!
శుక్రవారం గండం! వైఎస్ఆర్సీపీలో అలజడి
దుర్గగుడి లడ్డూ ప్రసాదంలో వెంట్రుకలు!
జైల్లో నా భర్తను.. టార్చర్ చేస్తున్నారు..!
రిజిస్ట్రేషన్ శాఖలో డిజిటల్ విప్లవం: లాభమా? నష్టమా?
ఇంటర్ విద్యార్థులకు పండుగలాంటి వార్త!