ఏచూరి మరణంతో వామపక్షాలు పెద్దదిక్కుని కోల్పోయాయి
సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతి పట్ల జీవీ ఆంజనేయులు సంతాపం
న్యూస్తెలుగు/ వినుకొండ : కమ్యూనిస్టు దిగ్గజం, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరణంతో భారత వామపక్షాలు పెద్దదిక్కుని కోల్పోయాయని తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. జాతీయ రాజకీయాలకు కూడా ఈ వెలితి తీరనిదని అన్నారాయన. విద్యార్థి రాజకీయాలతో మొదలుపెట్టి భారత కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా, రాజ్యసభ సభ్యుడిగా, సీపీఎం ప్రధాన కార్యదర్శిగా ఆయన చేసిన పోరాటాలు, అందించిన సేవలు ఎనలేనివని కొనియాడారు జీవీ. అనారోగ్యంతో చికిత్స పొందుతూ దిల్లీ ఎయిమ్స్లో కన్నుమూసిన సీతారాం ఏచూరికి ఈ మేరకు గురువారం సంతాపం ప్రకటించారు ఎమ్మెల్యే జీవీ. ఆయన లాంటి వ్యక్తి రాజకీయాల్లో చాలా అరుదుగా ఉంటారని ఏచూరి సేవలను స్మరించుకున్నారు. రాజకీయాల్లో ఓనమాలు దిద్దిన పార్టీలోనే తుదిశ్వాస వరకు కొనసాగిన సీతారాం ఏచూరి రాజకీయాల్లో ఎంతోమందికి ఆదర్శమన్నారు. (Story : ఏచూరి మరణంతో వామపక్షాలు పెద్దదిక్కుని కోల్పోయాయి)