ముస్లిం సోదరులకు కొండంత అండగా ఉంటాం
న్యూస్ తెలుగు/వినుకొండ : ముస్లిం సోదరులకు ఎన్డీయే ప్రభుత్వం, తాను వ్యక్తిగతంగా ఎల్లప్పుడూ అండగా ఉంటామని స్థానిక ఎమ్మెల్యే జి.వి. ఆంజనేయులు స్పష్టం చేశారు. రంజాన్ పండుగను పురస్కరించుకుని ఆయన ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అల్లా ఆశీస్సులతో అందరూ ఆయురారోగ్యాలు, అభివృద్ధి సాధించాలని, ప్రపంచ దేశాల మధ్య యుద్ధాలు ఆగిపోయి శాంతి నెలకొనాలని ఆయన ప్రార్థించారు. రాష్ట్రంలో ఇమామ్లు, మౌజన్ల గౌరవ వేతనాల నిమిత్తం రూ. 45 కోట్లు విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఎమ్మెల్యే ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ నిధులు రూ. 45 లక్షలతో నిర్మించిన ప్రహరీ గోడతో ఈద్గాకు ఎంతో అందం వచ్చిందని ఆయన అన్నారు. మత పెద్దల కోరిక మేరకు మిగిలిన పనుల పూర్తికి మరో రూ. 25 లక్షలు వెచ్చించి, ఈ ఏడాదిలోనే పనులు పూర్తి చేయిస్తామని హామీ ఇచ్చారు. గతంలో ఇచ్చిన మాట ప్రకారం, ఈద్గా నిర్మాణ ఖర్చులో సగం (50 శాతం) నిధులను తన వ్యక్తిగత బాధ్యతగా అల్లాకు సమర్పిస్తానని ఆయన పునరుద్ఘాటించారు. నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలని ముస్లిం పెద్దలను కోరారు. తనను మూడుసార్లు గెలిపించడంలో ముస్లింల పాత్ర ఎంతో కీలకమైనదని, వారి అండదండలకు తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని కృతజ్ఞతలు తెలిపారు. కష్టసుఖాల్లో వారికి తోడుగా ఉంటానని వాగ్దానం చేశారు. ముస్లింలు తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించి, ఆర్థిక ప్రగతిలో ముందుండాలని ఆయన పిలుపునిచ్చారు. త్వరలోనే స్థానిక ముస్లిం కమిటీ పెద్దలను ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని జీవి ఆంజనేయులు ఈ సందర్భంగా వెల్లడించారు.(Story : ముస్లిం సోదరులకు కొండంత అండగా ఉంటాం )
