సొంత కుటుంబానికే న్యాయం చేయలేని జగన్.. రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తారు?
న్యూస్ తెలుగు/వినుకొండ : మహిళల ఆస్తి హక్కులు కేవలం ఒక కుటుంబానికి పరిమితమైన వ్యవహారం కాదని, అది సమాజంలోని ప్రతి మహిళ గౌరవం, భద్రత, సమానత్వానికి సంబంధించిన అత్యంత కీలకమైన అంశమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు స్పష్టం చేశారు. నియోజకవర్గంలో నిర్వహించిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్ వైఖరిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అధికారంలో ఉన్న సమయంలో వేల కోట్ల ఆస్తులు కూడబెట్టిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, చట్టబద్ధంగా తన తల్లి, చెల్లెలకు సమాన హక్కులు ఇవ్వడంలో ఎందుకు వెనుకడుగు వేస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సొంత కుటుంబంలోనే తల్లి, చెల్లెలకు న్యాయం చేయలేని వారు, రేపు రాష్ట్ర ప్రజలకు న్యాయం చేస్తారని ఎలా నమ్మాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. మహిళల హక్కులను గౌరవించని నాయకత్వం సమాజాన్ని సన్మార్గంలో నడిపించలేదని విమర్శించారు.మహిళల ఆస్తి హక్కులను రక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తుచేసిన ఆయన, ఈ అన్యాయాన్ని ఎదిరించేందుకు మహిళా లోకం గళం విప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.సత్యం, న్యాయం కోసమే డాక్టర్ సునీత, డాక్టర్ వైఎస్ సునీత న్యాయం కోసం చేస్తున్న పోరాటం వ్యక్తిగతమైనది కాదని, అది సత్యం, న్యాయం కోసం జరుగుతున్న ప్రజాస్వామ్య పోరాటమని జీవీ ఆంజనేయులు అభివర్ణించారు. ఈ పోరాటానికి మహిళలు, ప్రజాస్వామ్యవాదులు, న్యాయం కోరే ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. వైఎస్ అవినాష్ రెడ్డిపై ఉన్న ఆరోపణలు, సాక్ష్యాధారాల ధ్వంసం వంటి అంశాలు ప్రజల్లో తీవ్ర అనుమానాలకు దారితీస్తున్నాయని ఆయన తెలిపారు. ఈ కేసులో పూర్తి స్థాయి, పారదర్శక దర్యాప్తు జరిపి నిజాలను వెలికితీయాలని డిమాండ్ చేశారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని వ్యక్తిగత కేసుల నుంచి బయటపడటానికి, అక్రమ ఆస్తులను కాపాడుకోవడానికి వినియోగించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమన్నారు.కుల, మత, ప్రాంతీయ భావోద్వేగాలను రెచ్చగొట్టి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను ప్రజలు అప్రమత్తంగా ఉండి ఖండించాలని ఆయన కోరారు. రాష్ట్రంలో మహిళల ప్రాణాలు, ఆస్తి హక్కులను కాపాడటానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని, నేరస్థులను చట్టం ముందు నిలబెట్టాలని జీవి ఆంజనేయులు స్పష్టం చేశారు.(Story : సొంత కుటుంబానికే న్యాయం చేయలేని జగన్.. రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తారు? )
