చింతలచెరువులో ఉచిత పశువైద్య శిబిరం
ఆకట్టుకున్న మేలు జాతి లేగదూడల ప్రదర్శన.
వినుకొండ వ్యవసాయ మార్కెట్ యార్డ్, పశుసంవర్ధక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహణ….
పాల్గొన్న మార్కెట్ యార్డ్ చైర్మన్, పశుసంవర్ధక శాఖ అధికారులు….
న్యూస్ తెలుగు/వినుకొండ : వినుకొండ నియోజకవర్గంలోని నూజండ్ల మండలం చింతలచెరువు గ్రామంలో మంగళవారం వినుకొండ వ్యవసాయ మార్కెట్ యార్డ్, పశు సంవర్ధక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత పశువైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా రాష్ట్రీయ గోకుల మిషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మేలు జాతి లేగదూడల ప్రదర్శన ప్రత్యేకంగా ఆకట్టుకుంది. ఈ శిబిరాన్ని వినుకొండ మార్కెట్ యార్డ్ చైర్మన్ మీసాల మురళి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. పశుపోషకులు ఈ ఉచిత ఆరోగ్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మండలంలోని మరిన్ని గ్రామాల్లో భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తామని ఆయన తెలిపారు. నరసరావుపేట పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ పి. రామారావు శిబిరాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. పశువులు ఏడాదికి ఒక దూడను ఈనడం వల్ల రైతు ఆర్థికంగా లాభపడతాడన్నారు. లింగ నిర్ధారణ వీర్యం వినియోగించడం ద్వారా 95 శాతం ఆడ దూడలనే పొందవచ్చని సూచించారు. రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని పశుపోషణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను రైతులకు వివరించారు. అనంతరం వినుకొండ ఏరియా పశువైద్యాశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఎన్. శ్రీరాములు మాట్లాడుతూ.. “నేటి లేగ దూడలే రేపటి పాడి పశువులు” అని స్పష్టం చేశారు. దూడల పోషణ ఆవశ్యకతను, వాటి సంరక్షణ చర్యలను పశుపోషకులకు అవగాహన కల్పించారు. ఈ పశువైద్య శిబిరంలో మొత్తం 76 దూడలకు పేడ పరీక్షలు చేసి నులిపురుగుల మందులు, ఎదుగుదలకు అవసరమైన టానిక్ లు అందజేశారు. అలాగే 35 గేదెలకు గర్భకోశ పరీక్షలు, 25 పశువులకు చూడి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ కన్వీనర్ గంగినేని బాబు, వెల్లటూరు పశువైద్యురాలు డా. జి. కవిత, నూజండ్ల పశువైద్యుడు డా. డి.వి. శివాజీ, మార్కెట్ యార్డ్ సెక్రటరీ కృష్ణా నాయక్, సూపర్ వైజర్ రాఘవయ్య, గ్రామ సర్పంచ్ కొండలు, గ్రామ పెద్దలు అప్పారావు, యోగేశ్వరరావు, పశువైద్య సిబ్బంది ఝాన్సీ మరియు పశుపోషకులు పాల్గొన్నారు.(Story : చింతలచెరువులో ఉచిత పశువైద్య శిబిరం )

