చిలకలూరిపేట వద్ద రోడ్డు ప్రమాదంలో మరణించిన విద్యార్థుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి బొల్లా
న్యూస్ తెలుగు/వినుకొండ : ఈనెల 4వ తేదీ చిలకలూరిపేట వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలను మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆదివారం నాడు పరామర్శించారు. ములకలూరు, శివాపురం, తాళ్లూరు, పిడుగురాళ్ల గ్రామాలకు చెందిన విద్యార్థులు యశ్వంత్ సాయి, వాసు, శ్రీకాంత్ రెడ్డి, రామిరెడ్డి, మహేష్ కుటుంబాలను ఆయన పరామర్శించి విచారం వ్యక్తం చేసి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని, అలాగే ప్రమాద సంఘటనను విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రోడ్డుపై వెళ్తూ ఉన్న కంటైనర్ ను ఒక కారు స్పీడ్ గా వచ్చి స్లో చేయటం జరిగిందని, ఈ క్రమంలో వెనుక నుంచి వస్తున్న విద్యార్థుల కారు కంటైనర్ ను ఢీ కొట్టి ప్రమాదం జరిగిందని, రోడ్డుపై వెళుతున్న కంటైనర్ ను ఆపింది ఒక ప్రభుత్వ కారు అని, ఆ కారు ఎవరిదో విచారణ జరపాలన్నారు. మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలు శోకసముద్రంలో మునిగిపోయి ఆయా గ్రామాల్లో విషాదం చోటు చేసుకుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వీరితో పాటు వైసిపి నేతలు, పగడాల వెంకటరామిరెడ్డి, అమ్మిరెడ్డి అంజిరెడ్డి, దండు చెన్నయ్య, శివ, బేతం గాబ్రియేలు, తదితరులు పాల్గొన్నారు.(Story :చిలకలూరిపేట వద్ద రోడ్డు ప్రమాదంలో మరణించిన విద్యార్థుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి బొల్లా )

