పేద కుటుంబాలను ఆదుకుంటున్న సీఎం సహాయనిధి
కూటమి ప్రభుత్వం ఏర్పడిన 18 మాసాలలో వినుకొండ నియోజకవర్గం లోని 1147 మందికి 7 కోట్ల 90 లక్షల 52 వేలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసినట్లు ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జివి ఆంజనేయులు అన్నారు. శుక్రవారం వినుకొండ చీఫ్ విప్ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ కార్యక్రమం జరిగింది. వైసిపి హాయంలో నామమాత్రంగానే సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగిందని, అయితే ఆనాడు ఆరోగ్యశ్రీ పథకం సక్రమంగా అమలు చేయకుండా ఆస్పత్రులకు బిల్లులు ఇవ్వని కారణంగా ఆ పథకం నిర్వీరమైందన్నారు. నేడు రాష్ట్రవ్యాప్తంగా సీఎం రిలీఫ్ ఫండ్ కింద 400 కోట్లు పంపిణీ జరిగిందన్నారు. కాగా శుక్రవారం నాడు నియోజకవర్గంలోని 62 మందికి 40 లక్షల 63 వేలు రూ. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. అలాగే కూటమి ప్రభుత్వం కొన్ని సంస్కరణలు చేపట్టిన కారణంగా ప్రభుత్వ స్కూల్స్ బాలబాలికలతో కళకళలాడుతున్నాయన్నారు. ఆయా స్కూల్స్ లో స్పోర్ట్స్ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్న కారణంగా విద్యా విధానంలో సమూల మార్పులు వచ్చాయన్నారు. గత వైసిపి ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని లూటీ చేసిన కారణంగా, నేడు అభారం మొత్తం ప్రభుత్వంపై ప్రజలపై పడిందన్నారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా సూపర్ సిక్స్ పథకం సూపర్ హిట్ అయిందని జీవి హర్షం వ్యక్తం చేశారు. ఫీజు రియంబర్స్మెంట్, అన్నదాత సుఖీభవ పథకం, స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు. కొన్నింటిపై జీఎస్టి ఎత్తివేసిన కారణంగా ప్రజలంతా లబ్ధి పొందుతున్నారన్నారు. క్యాన్సర్ సంబంధించిన మందులపై పూర్తిగా జిఎస్టి ఎత్తివేయడం జరిగిందన్నారు. కొన్ని మందులపై 12 శాతం నుండి ఐదు శాతం వరకు జీఎస్టీ తగ్గించడం జరిగిందన్నారు. అలాగే ఆహార పదార్థాలపై జిఎస్టి తగ్గించిన కారణంగా రాష్ట్రానికి 8 వేల కోట్లు ఆదాయం తగ్గిందని ఈ సందర్భంగా జీవి వివరించారు. ఈ సందర్భంగా జీవి చేతుల మీదుగా లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ దస్తగిరి షకీలా, ఐ డి సి. పెమ్మసాని నాగేశ్వరరావు, యార్డ్ చైర్మన్ లు మురళి కృష్ణ యాదవ్, గోవింద నాయక్, పట్టణ పార్టీ అధ్యక్షులు బొంకూరి రోశయ్య, నర్రా కిషోర్, తదితరులు పాల్గొన్నారు.(Story : పేద కుటుంబాలను ఆదుకుంటున్న సీఎం సహాయనిధి )

