బీసీల రిజర్వేషన్పై తెలంగాణ హైకోర్టు స్టే
న్యూస్తెలుగు/హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి రాష్ట్ర హైకోర్టు షాకిచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో 8పై హైకోర్టు స్టే విధించింది. జీవో అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వ కౌంటర్లపై అభ్యంతరాలకు దాఖలుకు పిటిషనర్లకు రెండు వారాల గడువు విధించింది. తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ పైనా హైకోర్టు స్టే విధించింది. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియ ఆరు వారాలపాటు నిలిచిపోనుంది. ఇప్పటికే స్థానిక ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తిచేసిన విషయం తెల్సిందే. అభ్యర్థుల ఎంపికపై కూడా దాదాపు అన్ని పార్టీలూ కసరత్తు మొదలుపెట్టాయి. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో రెండు రోజుల పాటు సుదీర్ఘ వాదనలు జరిగాయి. ప్రభుత్వం తరపున ఏజీ సుదర్శన్రెడ్డి వాదనలు వినిపించారు. బీసీ కులగణనకు అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసిందని, స్వాతంత్ర్యం తర్వాత సమగ్ర కులగణన సర్వే తెలంగాణలోనే జరిగిందని అన్నారు ఇంటింటికెళ్లి సర్వే చేశారని, ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో బీసీ జనాభా 57.6శాతం ఉన్నట్లు తేలిందన్న ఆయన.. 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు కోర్టుకు వివరించారు బీసీల్లో రాజకీయ వెనుకబాటుతనం ఉందని గుర్తించే అసెంబ్లీ తీర్మానం చేసిందన్నారు. మరో న్యాయవాది రవివర్మ తన వాదనలు వినిపిస్తూ రాజ్యాంగంలో రిజర్వేషన్లపై ఎక్కడా 50శాతం సీలింగ్ లేదన్నారు. ఎస్సీ ఎస్టీ, బీసీలు కలిపి 85 శాతం జనాభా ఉన్నారని, 85 శాతం జనాభాకు 42 శాతంతో కలిపి 67య శాతమే రిజర్వేషన్లు ఇస్తున్నామని వివరించారు. 15 శాతం జనాభాకు 33 శాతం ఓపెన్గానే ఉందన్నారు. వాదనలు విన్న ధర్మాసనం ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 9 పై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణ ప్రభుత్వ స్పందన ఇదీ
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ అమలుపై హైకోర్టు స్టే విధించడం పట్ల తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. ప్రభుత్వం తరపున మంత్రి శ్రీహరి స్పందించారు. ఉన్నత న్యాయస్థానం నిర్ణయంతో బీసీల నోటి వద్ద ముద్ద లాగేసినట్లయిందని మంత్రి వాకిటి శ్రీహరి వ్యాఖ్యానించారు. బీసీలు నిరాశ చెందాల్సిన అవసరం లేదని, 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చి తీరతామన్నారు. కోర్టు తీర్పు కాపీ చూసిన తర్వాత ఎలా ముందుకెళ్లాలో ఆలోచిస్తామని చెప్పారు. “హైకోర్టు తీర్పు కాపీ వచ్చాక సీఎం రేవంత్రెడ్డితో చర్చిస్తాం. సుప్రీం కోర్టుకు వెళ్లడంపై నిర్ణయం తీసుకుంటాం. కోర్టులో కేసులు వేయించింది భారత రాష్ట్ర సమితే భాజపాతో కుమ్మక్కై బీసీ రిజర్వేషన్లు అడ్డుకుంది. హైకోర్టు స్టే ఇవ్వకుండా ఉండేందుకు ఎంతో ప్రయత్నించాం” అని వాకిటి శ్రీహరి తెలిపారు. (Story: తెలంగాణ సర్కార్కు షాక్! బీసీల రిజర్వేషన్పై తెలంగాణ హైకోర్టు స్టే)

