పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి
న్యూస్ తెలుగు/వనపర్తి : పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తున్నామని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు. గురువారం మధ్యాహ్నం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఆవరణలో జరిగిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మొత్తం రూ.60,62,79,058 విలువ గల చెక్కులను 10,073 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అందులో 5,458 మంది సి.ఎం.ఆర్.ఎఫ్ లబ్ధిదారులకు రూ.12,16,36,850, 4,338 మంది కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ లబ్ధిదారులకు రూ.43,43,02,208, అలాగే 277 మంది ఎల్.ఓ.సి లబ్ధిదారులకు రూ.5,03,40,000 విలువైన చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ స్వలాభం కోసం రాష్ట్రాన్ని అప్పుల పాలుచేసిందని, పత్రికలపై మాత్రమే పనులు చూపించారని విమర్శించారు. వనపర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించిన ఆయన, కేవలం 22 నెలల పాలనలోనే 33,860 మంది రైతులకు రూ.253 కోట్ల రుణమాఫీ చేశామని తెలిపారు. సుమారు రూ.2,400 కోట్ల నిధులతో వనపర్తిలో ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, పెబ్బేరు 50 బేడెడ్ హాస్పిటల్, అర్బన్ , రూరల్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణం చేపట్టామన్నారు. అదనంగా అమృత 2.0 పథకం ద్వారా వనపర్తి, పెబ్బేరు మండలాలకు 20 సంవత్సరాల పాటు నీటి సమస్యలు రాకుండా రూ.80 కోట్లు మంజూరు చేయించామని వివరించారు. విద్యా రంగ అభివృద్ధి కోసం రూ.50 కోట్లు, రోడ్లు, డ్రైన్ల నిర్మాణానికి మరో రూ.60 కోట్లు కేటాయించామని ఎమ్మెల్యే చెప్పారు. స్థానికంగా చేపట్టిన ఈ అభివృద్ధి పనులు పేదల సంక్షేమానికి, ప్రజల అవసరాలకు దోహదం చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ పార్టీని తిరస్కరించారని, స్థానిక ఎన్నికల్లో కూడా వారికి అవకాశం ఇవ్వకూడదని ఎమ్మెల్యే మేఘా రెడ్డి పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ మహిళా విభాగ జిల్లా అధ్యక్షులు రెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షులు శంకర్ ప్రసాద్, జిల్లా కార్యదర్శి తిరుపతయ్య, మాజీ మున్సిపల్ ఛైర్మన్ బి.కృష్ణ, బ్లాక్ కాంగ్రెస్ నాయకులు, మాజీ సర్పంచ్ చందాపురం బాలస్వామి, ఇతర స్థానిక నాయకులు పాల్గొన్నారు.(Story : పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి )

