చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవం
న్యూస్ తెలుగు/చింతూరు : ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రసాయనిక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవం ఘనంగా నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా. కె. రత్న మాణిక్యం తెలియజేశారు. కళాశాల ప్రిన్సిపాల్ ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థినీ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ జీవరాశికి రక్షణ కవచంగా ఉన్న ఓజోన్ పొరకు ఏర్పడిన రంధ్రం కారణంగా కలిగే నష్టాల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి ఏటా సెప్టెంబర్ 16న ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారన్నారు. మోటార్ వాహనాలు పెరగడం, పరిశ్రమల కాలుష్యం, అధిక శాతం మంది ఏసీలను వినియోగించడం లాంటి చర్యలవల్ల ఓజోన్ పొర క్షీణించిపోతుందన్నారు. కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ముల్లి శేఖర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మొక్కలను నాటడం, అడవులను పరిరక్షించడం,పరిశ్రమల నుండి విడుదలయ్యే వినాశకర వాయువుల నుండి రక్షణ చర్యలను చేపట్టాలన్నారు. రసాయన శాస్త్ర విభాగాధిపతి కె. శకుంతల మాట్లాడుతూ “సైన్స్ నుండి గ్లోబల్ యాక్షన్ వరకు ” అనే ఈ సంవత్సరం థీమ్ తో శాస్త్రీయ పరిశోధన ద్వారా ఓజోన్ క్షీణతను గుర్తించడం, దాని హానికరమైన ప్రభావాలను అర్థం చేసుకోవడం, ఓజోన్ పొరను రక్షించడానికి సమన్వయంతో కృషి చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ అధ్యాపకులు జి. వెంకట్రావు, ఎస్. అప్పనమ్మ, జి.హారతి, కె.శైలజ, ఎం. నాగ మోహన్ రావు, ఆర్.మౌనిక, జి.సాయికుమార్, బి.శ్రీనివాసరావు, పి.మోనిక, ఎన్.ఆనంద్, అధ్యాపకేతర సిబ్బంది ,విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. (Story:చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవం)

