విజయనగరంకి తలమానికంగా.. సిమ్స్ చర్చ్ 150 వసంతాల వేడుకలు..
ఈనెల 10 నుంచి 14 వరకు ఐదు రోజుల పాటు..
విజయనగరం క్రైస్తవ మహా సభలు..
సంఘ మిత్ర డా. ఆర్ ఎస్ జాన్ వెల్లడి..
న్యూస్తెలుగు/విజయనగరం: మత సామరస్యానికి నెలవైన విజయనగరంలో అతి పెద్ద క్రైస్తవ సమాజంగా పేరెన్నికగన్న సిమ్స్ మెమోరియల్ బాప్టిస్ట్ (ఎస్ఎంబి ) చర్చ్ 150 వసంతాల వేడుకలు జరుపుకోవడం క్రైస్తవ సమాజానికి సంతోషకరమైన శుభవార్త అని వేడుకల నిర్వాహక ప్రతినిధి, సంఘమిత్ర డాక్టర్ ఆర్ ఎస్ జాన్ పేర్కొన్నారు. సిమ్స్ 150 వసంతాల వేడుకల నిమిత్తం డాక్టర్ ఆర్ ఎస్ జాన్ నేతృత్వంలో సోమవారం సిమ్స్ చర్చ్ లో విజయనగరం జిల్లాలోని వివిధ క్రైస్తవ సంఘాల దైవజనులతో ప్రత్యేక సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం దైవజనులు రెవరెండ్ వై ప్రభాకర్, బి ఎం రాజు, పాస్టర్లు మధుసూదన్ రావు, ఆనంద్, మధు, టి ఆనందరావు, పట్నాల పైడిరాజు తదితరులతో కలిసి సిమ్స్ వేడుకల కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆర్ ఎస్ జాన్ మాట్లాడుతూ..ఎంతో చారిత్రక నేపధ్యం కలిగిన విజయనగరం సిమ్స్ చర్చ్ 1875 లో స్థాపితమై ఈనెల పదో తేదీ నాటికి 149 వసంతాలు పూర్తి చేసుకుని, 150 వ వార్షికోత్సవంలోకి అడుగుపెట్టడం శుభదాయకమని హర్షం వ్యక్తం చేశారు. ఆ క్రమంలో ఈ ఉత్సవాలను విజయనగరం క్రైస్తవ సమాజానికి తలమానికంగా అత్యంత ఘనంగా నిర్వహించ తలపెట్టామన్నారు. అందులో భాగంగా ఈ నెల పదో తేదీ ఉదయం 9 గంటల నుంచి 14 వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఐదు రోజుల పాటు ‘ విజయనగరం క్రైస్తవ మహా సభలు ‘ నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ క్రైస్తవ మహా సభలకు ప్రముఖ దైవజనులైన రాజమండ్రి జాన్ వెస్లీ, మదనపల్లి రాజ శేఖర్, పలమనేరు వేద నాయకం, బెంగళూరు బెన్నీ ప్రసాద్, తిరుపతి హేమలత ప్రభ, హైదరాబాద్ వడ్డే నవీన్, రాజమండ్రి ఆర్థర్ ప్రసాద్, విజయనగరం వై ప్రభాకర్ తదితరులు హాజరై తమ వాక్య సందేశాల ద్వారా క్రైస్తవ సమాజాన్ని చైతన్య పరచనున్నట్టు జాన్ పేర్కొన్నారు. మరీ ముఖ్యంగా ఈ 150 వసంతాల వేడుకల్లోనే ‘ సౌత్ ఇండియా యూత్ కన్వెన్షన్ ‘ ను సెప్టెంబర్ 11 నుంచి 13 వరకు మూడు రోజుల పాటు నిర్వహించనున్నామని, ఈ కార్యక్రమంకి దక్షణాది రాష్ర్టాల నుంచి అధిక సంఖ్యలో యువత పాల్గొనున్నట్టు తెలిపారు. ఈ వేడుకల్లో భాగంగా రూ. 10 వేలు, 5 వేలు , 3 వేలు చొప్పున బహుమతులతో బైబిల్ రిఫరెన్స్(ఒక్కరు), బైబిల్ క్విజ్(ముగ్గురు), గ్రూప్ సింగింగ్ (ఐదుగురు) వంటి ఆధ్యాత్మిక పోటీలు నిర్వహించనున్నట్టు చెప్పారు. ఈ ప్రత్యేక వేడుకల కోసం సిమ్స్ జూబ్లీ కమిటీను ఏర్పాటు చేశామని చైర్మన్ గా ఏం ఏ నాయుడు, సెక్రటరీ గా టి ఆనంద్ రావు, ట్రెజరరీ గా జీ సుగుణాకర్ రావు, కన్వీనర్ గా ఆర్ ఎస్ ఏ కుమార్, కో కన్వీనర్ గా కే రాజ్ కుమార్, ఎడ్వైజర్ గా ఏప్రాయిం పట్టా, కో ఎడ్వైజర్ గా కే సుకుమార్, వర్షిప్ లీడర్ గా ఆర్ ఆశా జాన్ వ్యవహరిస్తారని తెలిపారు. జిల్లా క్రైస్తవ సోదరులతో పాటు మతాలకు అతీతంగా సర్వజనుల్ని ఈ మహా సభలకి ప్రేమతో ఆహ్వానిస్తున్నట్టు ఆర్ ఎస్ జాన్ పిలుపునిచ్చారు.(Story:విజయనగరంకి తలమానికంగా.. సిమ్స్ చర్చ్ 150 వసంతాల వేడుకలు..)

