ఆటిజం చిన్నారులకు 2 నెలల్లో కొత్త ఉపకరణాలు
జీవాలయంలో ప్రత్యేక అవసరాల విద్యార్థులకు ఉచిత ఉపకరణాల నిర్ధారణ శిబిరం
ఉచిత ఉపకరణాల నిర్ధారణ శిబిరాన్ని ప్రారంభించిన చీఫ్ విప్ జీవీ
న్యూస్ తెలుగు / వినుకొండ : వినుకొండ నియోజకవర్గంలోని ఆటిజం చిన్నారులకు రెండు నెలల్లో కొత్త పరికరాలు, ఉపకరణాలు అందిస్తామని ప్రభుత్వ చీఫ్విప్, స్థానిక శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు అన్నారు. ప్రత్యేక అవసరాల పిల్లల విషయంలో గతంలో ఎన్నడూ లేనంతగా కూటమి ప్రభుత్వం శ్రద్ధ చూపిస్తోందని,వారికి కావాల్సిన అన్ని వసతులు, ఆర్థిక సహాయాలు కూడా లభించేలా చేస్తున్నామన్నారు. వినుకొండ లయోల ఇంగ్లీష్ మీడియం పాఠశాల(జీవాలయం)లో శుక్రవారం పాఠశాల విద్యా శాఖ- సమగ్ర శిక్షా అభియాన్ ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాల విద్యార్థులకు ఉచిత ఉపకరణాల పంపిణీ కోసం ఉచిత ఉపకరణాల నిర్ధారణ శిబిరం నిర్వహించారు. చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొని ఈ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జీవి మాట్లాడుతూ. ఆటిజం చిన్నారుల కోసం తెలుగుదేశం గత ప్రభుత్వంలోనే ప్రత్యేక ఆర్థిక సహాయ కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు. మధ్యలో అయిదేళ్ల వైకాపా పాలనలో అది కూడా నిలిపివే యడం దుర్మార్గం అన్న జీవీ ఇప్పుడు రూ. 3వేల సాయాన్ని రెట్టింపు చేసి రూ. 6 వేలు అందిస్తు న్నామన్నారు. ముఖ్యంగా విభిన్న ప్రతిభావంతులైన చిన్నారుల విషయంలో మంత్రి నారా ఎం తో మానవత్వంతో ఆలోచించి భవిత కేంద్రాల ద్వారా విశేష సేవలు అందిస్తున్నారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 85వేల మంది ఉన్న ఆటిజం విద్యార్థుల కోసం 2,282మంది స్పెషల్ టీచర్లను ఏర్పాటు చేస్తున్నామని, ఫిజియోథెరపిస్ట్లను కూడా నియమిస్తున్నామన్నారు. రాష్ట్రం మొత్తం మీద 125 ఆటిజం కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆటిజం పిల్లలకు మంచి విద్యను అందించాలని 33 రకాల యాప్లు లోడ్ చేసిన ట్యాబ్లు ఉచితంగా ఇస్తున్నారని, వారిలోని నైపుణ్యాన్ని వెలికి తీసి సమాజానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దుతున్నారని అన్నారు. అయిదేళ్ల వైకాపా ప్రభుత్వంలో ఒక్క టీచర్ నియామకం కూడా చేయలేదన్న జీవీ స్పెషల్ టీచర్ల ఊసే తీయలేదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తొలి ఏడాదిలోనే మెగా డీఎస్సీ నిర్వహణ, నియామక ప్రక్రియ పూర్తి చేసే వరకు అన్నీ చేతల్లో చేసి చూపించామన్నారు. జిల్లా సమ్మిళిత విద్య కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికి నాణ్యమైన చదువులు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. శుక్రవారం విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి ఎవరికి ఏ అవసరమో గుర్తించామని 2నెలల్లో వారికి ఆ మేరకు కొత్త పరికరాలు, ఉపకరణాలు ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కౌన్సిలర్లు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.(Story:ఆటిజం చిన్నారులకు 2 నెలల్లో కొత్త ఉపకరణాలు)

