వర్షాల కారణంగా రైతులకు తీవ్రనష్టం
పత్తి పంటను చూడని కూటమి ప్రభుత్వం లబోదిబోమంటున్న పత్తి రైతులు:- బొల్లా బ్రహ్మనాయుడు
న్యూస్ తెలుగు / వినుకొండ : ఇటీవల కురిసిన వర్షాలకు బొల్లాపల్లి మండలం జయంతి రామపురం, రెడ్డిపాలెం, మేళ్లవాగు, పమిడిపాడు గరికపాడు, గుమ్మనంపాడు, అయ్యన్నపాలెం రేమిడిచర్ల గ్రామలతో పాటు ఈపూరు మండలంలో కూడా కొన్నిగ్రామాల్లో పంట నష్టం జరిగింది. ఆరుగాలం శ్రమించి సాగుచేసిన పత్తి పంట చేతికందే దశలో పూర్తిగా పాడైపోయింది రైతులు ఆందోళన చెందుతున్నారని స్థానిక మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఏ పంట వేసినా కనీస మద్దతు ధర లేక రైతులు నష్టపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తోంది. మాటలు కోటలు దాటుతున్నాయి, కానీ అభివృద్ధి మాత్రం కనిపించడం లేదన్నారు. గిట్టుబాటు ధరలేక ఇబ్బందులు పడుతున్న రైతులకు వర్షం రూపంలో తీవ్రనష్టం జరుగుతుంది. వర్షాలకు పంటదెబ్బతిని ఇబ్బందులు పడుతుంటే ఇంతవరకు ఏ ప్రభుత్వ అధికారి వచ్చి చూడలేదని రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బ్రహ్మనాయుడు విమర్శించారు. రైతుల ఆవేదనను శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు కానీ, స్థానిక అధికారులు కూడా పరిశీలించకపోవడం గమనార్హం. వ్యవసాయం, కష్టతరంగా మారిందని ఇప్పటికే లక్షల రూపాయలు పెట్టుబడిపెట్టి రైతులు అప్పులుపాలయ్యారని అన్నారు. ఈ పంటకూడా చేతికి రాకపోతే ఆత్మ హత్యలే శరణ్యమని రైతులు అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నష్టం అంచనావేసి రైతులకు నష్ట పరిహారం వచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఎన్నికల్లో గెలుపు కోసం చంద్రబాబు కుమారుడు లోకేష్ అనేక హామీలు ఇచ్చినా, అవి ఇప్పటికీ నెరవేర్చని పరిస్థితి ఉంది. అమరావతి రైతులను మళ్లీ మోసం చేసే ఆలోచన చంద్రబాబు నాయుడు చేస్తున్నారు. మద్దతు ధర లేక నష్టపోయిన రైతుల తరఫున వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం ఉద్యమిస్తూనే ఉంటుందన్నారు. (Story:వర్షాల కారణంగా రైతులకు తీవ్రనష్టం )

