వినుకొండలో ఎరువుల దుకాణాలపై అధికారుల ఆకస్మిక తనిఖీలు
న్యూస్ తెలుగు/వినుకొండ : పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు ఆదేశాల మేరకు వినుకొండ పట్టణంలోని పలు ఎరువుల దుకాణాలపై సోమవారం తహశీల్దార్ సురేష్ నాయక్, మండల వ్యవసాయ అధికారి వరలక్ష్మిలతో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రైతుల ప్రయోజనాలను కాపాడటం, నాణ్యతలేని ఎరువుల విక్రయాలను నివారించడమే ఈ తనిఖీల ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు. తనిఖీల్లో భాగంగా, దుకాణాల లైసెన్సులు సక్రమంగా ఉన్నాయో లేదో అధికారులు పరిశీలించారు. అలాగే దుకాణాల్లో నిల్వ ఉన్న ఎరువుల స్టాక్కు సంబంధించిన రిజిస్టర్లను, వాటి ధరల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఎరువుల ధరలను ప్రభుత్వం నిర్ణయించిన రేట్ల ప్రకారం విక్రయిస్తున్నారా లేదా అని తనిఖీ చేశారు. అధిక ధరలకు ఎరువులను విక్రయించడం, నాణ్యతలేని ఉత్పత్తులను అమ్మడం వంటి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. రైతులు ఎరువులు కొనుగోలు చేసేటప్పుడు తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలని, ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని అధికారులు సూచించారు. ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, ఎరువుల దుకాణదారులు నిబంధనలను పాటించాలని అధికారులు హెచ్చరించారు.(Story : వినుకొండలో ఎరువుల దుకాణాలపై అధికారుల ఆకస్మిక తనిఖీలు )

