పేదలకు నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ ప్రాధాన్యం
వినుకొండ రైలుపేటలో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభించిన జీవీ
న్యూస్ తెలుగు / వినుకొండ : రాష్ట్రంలోని పేదలు, అల్పాదాయ వర్గాలకు నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రభుత్వ చీఫ్విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. నేషనల్ హెల్త్ మిషన్ అమలు, ప్రజల ఆరోగ్య సంరక్షణలో దేశంలో ఏపీ దక్షిణాదిలోనే మొదటి స్థానంలో నిలవడమే అందుకు నిదర్శనంగా తెలిపారు. నిరంతరం ఆస్పత్రుల అభివృద్ధి, వసతు ల కల్పన, ఔషధాలు అందించడం ద్వారా గణనీయమైన మార్పులు తీసుకుని వస్తున్నామన్నారు. వినుకొండ పట్టణంలోని 11వ వార్డు రైలుపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా చీఫ్విప్ జీవీ మాట్లాడుతూ. గ్రామీణ, ప్రాంతాల్లో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం కూటమి ప్రభుత్వం ఏడాదిలోనే ఎంతో పురోగతి సాధించిందన్నారు. ఎక్కడికక్కడ ఆస్పత్రుల ఏర్పాటు ద్వారా స్థానిక ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలు, టీకాలు, మాతా-శిశు సంరక్షణ, కుటుంబ నియంత్రణ సేవలు అందుబాటులోకి రావడం హర్షణీయం అన్నారు. ప్రజలు ఈ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకొని ఆరోగ్యంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. నేషనల్ హెల్త్ మిషన్ క్రింద రాష్ట్ర వ్యాప్తంగా 150 పీహెచ్సీలు ప్రారంభించడం రాష్ట్ర ఆరోగ్య రంగం అభివృద్ధికి కీలకమైన దశగా పేర్కొన్నారు. అంతేగాక, స్వచ్ఛ సర్వేక్షణ్లో గతంలో 150వ స్థానంలో ఉన్న రాష్ట్రం ఇప్పుడు 9వ స్థానానికి చేరుకోవడం అభినందనీయమన్నారు. అర్భన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల ద్వారా పట్టణ పేదలకు మేలు జరుగుతుందని తెలిపారు. మంచి వైద్యులు, మెరుగైన ఔషధాలు, ఆధునిక వసతులతో ప్రభుత్వ ఆస్పత్రులు ప్రజలకు మరింత చేరువవుతున్నాయని చెప్పారు. గత ప్రభుత్వంలో మందులు, ఇంజెక్షన్లు లేక ప్రజలు ఆస్పత్రికి వెళ్లడానికే భయపడేవారని, ఇప్పుడామాటలే లేదు అన్నారు. ఎన్టీఆర్ ఆరోగ్య సేవల్లో ఎక్కడా ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ప్రతినిత్యం బిల్లులు చెల్లిస్తోందని, ప్రజల ఆరోగ్యభద్రతే తమ లక్ష్యమన్నారు. నేడు ప్రారంభించిన నీ ఆరోగ్య సెంటర్లో సుమారు 3వేల కుటుంబాలు ఈ వైద్య శాలలో వైద్య సేవలు పొందవచ్చు అన్నారు. ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికాహారం కూడా అవసరమని, ప్రభుత్వ హాస్పిటళ్ల విస్తరణతో పాటు ఆరోగ్య అవగాహన పెంపుపై కూడా దృష్టి పెడుతున్నామని తెలిపారు. 2027 నాటికి రాష్ట్ర సగటు ఆయుర్దాయం 86 ఏళ్లకు పెంచాలన్నదే లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు, వైద్య శాఖ అధికారులు, డిప్యూటీ డిఎం హెచ్.ఓ.పద్మావతి, డాక్టర్ సాయి సోము, వైద్య సిబ్బంది, టిడిపి నేతలు, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు. (Story:పేదలకు నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ ప్రాధాన్యం)

