దైనందిన జీవనశైలిలో యోగా భాగం కావాలి
న్యూస్ తెలుగు/సాలూరు : జూన్ 7 దైనందిన జీవనశైలిలో యోగా భాగం కావాలని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సన్నాహక చర్యలలో భాగంగా సాలూరు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యోగా అభ్యాసానికి ప్రతి ఒక్కరూ ప్రోత్సాహం ఇవ్వాలని పిలుపునిచ్చారు. “మన దైనందిన జీవనశైలిలో యోగా భాగమైనప్పుడే శారీరకంగా, మానసికంగా ఆనందకరమైన జీవితం సాధ్యమవుతుంది” అన్నారు. యోగా మన ఆరోగ్యానికి మెరుగైన మార్గమని, జూన్ 21న జరిగే 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విశాఖపట్నంలో జరుపుకోవడం తెలుగు ప్రజల అదృష్టంగా భావిస్తున్నానని ఆమె పేర్కొన్నారు. ఆ వేడుకల్ల ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనడం జరుగుతుందని మంత్రి తెలిపారు. యోగ భారతీయ ప్రాచీన సంప్రదాయం అన్నారు. ఆరోగ్యమే మహా భాగ్యం అని అందుకు యోగ సాధన గొప్ప ఫలితాలు ఇస్తుందనడంలో సందేహం లేదని అన్నారు. యోగ ఆరోగ్యానికి, మానసిక ప్రశాంతతకు, ఒత్తిడిని జయించుటకు గొప్ప సాధనమని మంత్రి పేర్కొన్నారు. జిల్లాలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోందని, ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమాన్ని సాలూరు మున్సిపల్ కమిషనర్ కృష్ణా రావు, అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలు పెద్దఎత్తున హాజరయ్యారు.(Story : దైనందిన జీవనశైలిలో యోగా భాగం కావాలి )

