రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదు
న్యూస్తెలుగు/వనపర్తి : రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేయడం జరుగుతుందని రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి రైతులకు భరోసా ఇచ్చారు. బుధవారం ఉదయం శ్రీరంగాపూర్ మండలంలోని శేరిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లుతో కలిసి సందర్శించారు. ఇప్పటివరకు ఇంకా వరి కోతలు ప్రారంభించని రైతులు వెంటనే కోతలు ప్రారంభించి వడ్లను కొనుగోలు కేంద్రాలకు తరలించాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన టార్ఫాలిన్ లు అందుబాటులో ఉన్నాయని, వర్షానికి వడ్లు తడిచిపోకుండా కప్పి ఉంచాలని తెలియజేశారు. లారీల కొరత లేదని, తేమ శాతం 17 వరకు ఉన్నా వెంటనే తూకం వేసి లారీల్లో ఎక్కించాలని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు. హమాలిల కొరత లేకుండా చూసుకోవాలని ధాన్యం తరలింపు వేగంగా జరగాలని సూచించారు. ఒక్క శేరిపల్లి గ్రామానికి , ఒకేరోజు 10 లారీలు పెట్టడం జరిగిందని, అవసరమైతే ఇంకొన్ని లారీలు సమకూర్చుతామని రైతులకు భరోసా కల్పించారు. నైరుతి రుతుపవనాలు రాష్ట్రానికి 15 రోజులు ముందుగా రావడం వల్ల రైతులు కొంత ఇబ్బందులకు గురవుతున్నారని, ఈ వాతావరణ మార్పు కు అనుగుణంగా రైతులు సైతం పంట కోతలు త్వరగా ప్రారంభించి కొనుగోలు కేంద్రాల్లో తూకం చేసే వరకు వడ్లు తడిచిపోకుండా టార్పాలిన్ లు కప్పి ఉంచాలని రైతులను సూచించారు. అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు, సివిల్ సప్లై అధికారి విశ్వనాథ్, శ్రీరంగాపూర్ తహసిల్దార్ రాజు, రైతులు తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు. (Story:రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదు)

