Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌రాజ్యాంగ రక్షకులు మీరే: కె.నారాయణ

రాజ్యాంగ రక్షకులు మీరే: కె.నారాయణ

రాజ్యాంగ రక్షకులు మీరే

మహోద్యమ నిర్మాణాలకు తిరుపతి మహాసభలు నాంది కావాలి
ఏఐవైఎఫ్‌ మహాసభల అధ్యక్షోపన్యాసంలో యవతకు డాక్టర్‌ కె.నారాయణ ఉద్బోధ

న్యూస్‌తెలుగు/తిరుపతి: రాజ్యాంగం గురించి ఏ మాత్రం అవగాహనలేని, గౌరవంలేని శక్తులు ప్రస్తుతం దేశాన్ని పాలిస్తున్నాయని, రాజ్యాంగ పవిత్రతకు ప్రమాదం వాటిల్లుతున్న నేపథ్యంలో నేటి యువత అప్రమత్తం కావాల్సిన తరుణం ఆసన్నమైందని సీపీఐ జాతీయ కార్యదర్శి, అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్‌)17వ జాతీ మహాసభల ఆహ్వానసంఘం అధ్యక్షులు డాక్టర్‌ కె.నారాయణ అన్నారు. ఏఐవైఎఫ్‌ మహాసభలు సందర్భంగా శుక్రవారం నాడు తిరుపతిలోని కామ్రేడ్‌ కనం రాజేంద్రన్‌ హాలు (కచ్ఛపి ఆడిటోరియం)లో ప్రతినిధుల సభ ప్రారంభమైంది. నారాయణ ఆహ్వానసంఘం తరపున అధ్యక్షోపన్యాసం చేస్తూ, ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రేరేపిత బీజేపీ పాలనలో రాజ్యాంగ వ్యవస్థలు అవమానాలను ఎదుర్కొంటున్నాయని, గవర్నర్ల అధికారాల విషయంలో ఇటీవల సుప్రీంకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలను రాష్ట్రపతి సైతం ఖండిరచిన తీరు చూస్తుంటే, రాజ్యాంగానికి ముప్పు పతాకస్థాయికి చేరిందని అర్థమవుతున్నదని, ఈ పరిణామాల పట్ల యువత అప్రమత్తం కావాలని కోరారు.
మహోన్నత ఉద్యమ చరిత్ర కలిగిన ఏఐవైఎఫ్‌ జాతీయ మహాసభల ఆహ్వానసంఘానికి చైర్మన్‌గా ఉండటం తనకెంతో గర్వంగా ఉందని నారాయణ అన్నారు. దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌, చంద్రశేఖర్‌ ఆజాద్‌, అల్లూరి సీతారామరాజు, కన్నెగంటి హనుమంతుల వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు సామ్రాజ్యవాద వ్యతిరేక, నయా వలసవాద వ్యతిరేకతతో ఏఐవైఎఫ్‌ 1959 మే 3న పురుడుపోసుకొని, ప్రగతిశీల యువజన సంస్థగా పురోగమిస్తున్నదని చెప్పారు. ప్రపంచ యువ చిహ్నం చేగువేరా నుండి ప్రేరణ పొందిన ఏఐవైఎఫ్‌ ఆధ్వర్యంలో యువతరం నేటికీ తమ భుజాలపై సామ్రాజ్యవాద వ్యతిరేక జెండాను మోస్తోందని అన్నారు. ఇది ప్రపంచ శాంతి కోసం పనిచేస్తూ, మతోన్మాదం, ఇతర వివక్షలకు వ్యతిరేకంగా నిలబడిరదన్నారు. 18 సంవత్సరాల వయస్సులో ఓటు హక్కు కోరుతూ యువతను సమీకరించి డిమాండ్‌ను సాధించిన దేశంలోని ప్రముఖ యువజన సంస్థ ఇదేనన్నారు. ‘‘జాబ్‌ లేదా జైలు’’ అనే నినాదంతో దేశవ్యాప్తంగా మిలిటెంట్‌ పోరాటాలు నిర్వహించిందని గుర్తుచేశారు. మతతత్వానికి వ్యతిరేకంగా, లౌకికవాదం, ప్రజాస్వామ్యం కోసం పోరాడుతోందని, ‘సేవ్‌ ఇండియా- చేంజ్‌ ఇండియా’ అనే నినాదంతో దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ప్రారంభించిందన్నారు.
డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ లిఖించిన రాజ్యాంగం మనకు ఇచ్చిన విద్య, వైద్య సౌకర్యాలు వంటి ప్రాథమిక హక్కుల రక్షణ, అమలు కోసం అవిశ్రాంతంగా పోరాడుతున్న సంస్థ ఏఐవైఎఫ్‌ అని, అన్ని స్థాయిలలో అవినీతికి వ్యతిరేకంగా నేటికీ పోరాడుతూ, అప్రమత్తంగా ఉంటున్నదన్నారు.దళితులు, ఆదివాసీలు, మహిళలు, మైనారిటీలు వంటి అణగారిన వర్గాలను రక్షించడంలో, వారిపై దాడులు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఏఐవైఎఫ్‌ ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుందని నారాయణ చెప్పారు. మాదకద్రవ్యాల మాఫియా, అశ్లీల సాహిత్యాన్ని, బాల్య వివాహాలు, వరకట్న వ్యవస్థ వంటి అన్ని సామాజిక దురాచారాలను నిర్మూలించడంలో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. రాజకీయ పాఠశాలలను క్రమం తప్పకుండా నిర్వహించడం ద్వారా యువతరానికి రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా కూడా అవగాహన కల్పిస్తోందని చెప్పారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే, ఏఐవైఎఫ్‌ వెంటనే స్పందించి పునరావాస కార్యకలాపాలు నిర్వహిస్తూ, బాధితులకు చేయూతనిస్తున్నదన్నారు.
ఏఐవైఎఫ్‌ మహాసభలకు తిరుపతి వేదిక కావడం తనకు గర్వకారణమని, తిరుపతి అనేది ఒక ప్రసిద్ధ తీర్థయాత్ర, దీనికి ప్రతిరోజూ 50,000-1,00,000 మంది ప్రజలు సందర్శిస్తారని తెలిపారు.ఈ చారిత్రాత్మక నగరానికి 11వ శతాబ్దంలో ప్రముఖ హిందూ వేదాంతి రామానుజచార్యులు పునాది వేశారని, పల్లవులు ఈ నగరాన్ని 6వ శతాబ్దంలో అభివృద్ధి చేశారని, ఈ చారిత్రాత్మక నగరం 17వ శతాబ్దం వరకు శ్రీకృష్ణదేవరాయలు సారథ్యంలోని విజయనగర సామ్రాజ్యంలో భాగంగా ఉండేదని తెలిపారు. చోళులు, పల్లవులు, పాండ్య రాజవంశాలకు చెందిన 1150 సంస్కృత శాసనాలు ఉన్నాయని, ప్రముఖ ప్రాచీన సంగీతకారుడు తాళ్లపాక అన్నమాచార్యులు కూడా ఈ చారిత్రక ప్రదేశం నుండి వచ్చారని గుర్తుచేశారు.ఈ చారిత్రక నగరాన్ని వర్ణిస్తూ ఆయన అనేక తెలుగు సాహిత్యాలను రాసి, ఆలపించారన్నారు. ఇది ఎస్‌వీ విశ్వవిద్యాలయం, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, సంస్కృత విశ్వవిద్యాలయం, వేద విశ్వవిద్యాలయం, స్విమ్స్‌ విశ్వవిద్యాలయం, వెటర్నరీ విశ్వవిద్యాలయం, ఐఐటీ మొదలైన విశ్వవిద్యాలయాలతో ప్రసిద్ధి చెందిన విద్యా కేంద్రమన్నారు. స్విమ్స్‌, బర్డ్‌, అరబిందో కంటి ఆసుపత్రి, టాటా క్యాన్సర్‌ ఆసుపత్రి వంటి అనేక ప్రముఖ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులతో కూడిన వైద్య కేంద్రాలకు తిరుపతి కేంద్రంగా ఉందన్నారు. పండితులు రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ, గౌరిపెద్ది రామసుబ్బశర్మ, ప్రముఖ ఎఫిగ్రఫిస్ట్‌ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి, ప్రఖ్యాత జర్నలిస్ట్‌ విద్వాన్‌ విశ్వం, మార్క్సిస్ట్‌ సాహిత్య విమర్శకుడు త్రిపురనేని మధుసూధనరావు, ప్రముఖ భాషావేత్త జీఎన్‌ రెడ్డి, మా తెలుగు తల్లికి మల్లెపూదండ రాసిన శంకరంబాడి సుందరాచారి ప్రభృతులు ఈ తిరుపతి నుంచి వచ్చిన వారేనని స్మరించారు. విప్లవ రచయితలకు, కమ్యూనిస్టు ఉద్యమాలకు పెట్టనికోట అని అన్నారు. విద్యార్థుల ఆందోళనలకు పుట్టినిల్లు అని అన్నారు. ఇలాంటి చరిత్ర కలిగిన తిరుపతిలో జరుగుతున్న ఏఐవైఎఫ్‌ మహాసభల్లో ప్రతినిధులు చురుగ్గా పాల్గొని, దేశ ప్రజాస్వామ్య పరిరక్షణ దిశగా మంచి నిర్ణయాలు తీసుకోవాలని కె.నారాయణ ఆశాభావం వ్యక్తం చేశారు. మహోద్యమ నిర్మాణాలకు ఇది నాంది కావాలని ఆకాంక్షించారు. (Story: రాజ్యాంగ రక్షకులు మీరే: కె.నారాయణ)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!