70 అడుగులకు వినుకొండ పట్టణ మెయిన్ రోడ్డు విస్తరణ
వినుకొండలో ట్రాఫిక్ నియంత్రణ, సీసీ కెమెరాలు ఏర్పాటుపై క్షేత్రస్థాయి పర్యటన
న్యూస్ తెలుగు / వినుకొండ : రోజురోజుకీ పెరుగుతున్న ట్రాపిక్ అవసరాల రీత్యా వినుకొండ పట్టణం ప్రధాన రహదారిని 35 నుంచి 70 అడుగులకు విస్తరిస్తున్నట్లు ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తెలిపారు. అందుకు సంబంధించిన ప్రణాళికలు కూడా కొలిక్కి వచ్చాయని, ప్రజలు, వ్యాపారులు అంతా కూడా అందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వినుకొండ పట్టణంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, జీడీసీసీబీ ఛైర్మన్ మక్కెన మల్లికార్జునరావు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్తూపం సెంటర్ లో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చేపట్టాల్సిన చర్యలు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సిన ప్రాంతాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ. వినుకొండలో రోజురోజుకీ ట్రాఫిక్ పెరుగుతూ ఉందని, పిల్లల చదువులు, ఉద్యోగాలు, ఉపాధి, వ్యాపారాల కోసం పట్టణానికి వచ్చేవారి సంఖ్య రెట్టింపు అవుతోందని, ఇక్కడ ఉండే కుటుంబాల సంఖ్య కూడా పెరుగుతోందన్నారు. ఎంపీడీవో కార్యాలయం వైపు రోడ్డును 35 నుంచి 70 అడుగుల రోడ్డుగా విస్తరిస్తున్నామని చెప్పారు. అందుకు సంబంధించి పట్టణ ప్రజలందరికీ కూడా ఉపయోగకరంగా చక్కని ప్రణాళిక చేయడం జరిగింది. మండల కార్యాలయం ఎదురుగా ఉన్న కాంప్లెక్స్లో పైరూములు ఎంతోకాలంగా ఖాళీగా ఉన్నాయని, నిరుపయోగంగా ఉండి మున్సిపాలిటీకి కూడా ఆదాయం లేదన్నారు. వాటిని తొలగించాలన్న నిర్ణయానికి అందరు సహకరించాలని కోరారు. ప్రజల అవసరాల మేరకు ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా షాపులు వాళ్లు కూడా ముందుకు రాకుండా ఉండాలని కోరారు. అలానే దొంగతనాలు, రౌడీయిజం వంటి సమస్యల అదుపు కోసం అవసరమైన చోట్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. ఆ విషయంలో ఏపీలోని మున్సిపాలిటీలు అన్నింటిలో వినకొండ ముందు ఉండడం అభినందనీయమన్నారు. ఇంకా అవసరమైన చోట్ల ఇంకా కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం జీడీసీసీబీ ఛైర్మన్ మక్కెన మల్లికార్జునరావు మాట్లాడుతూ. అన్ని ప్రభుత్వ విభాగాల సమన్వయంతో పట్టణంలోని ట్రాఫిక్, శాంతిభద్రతలు సహా అవస రమైన చర్యలు తీసుకుంటూ ఉండడం సంతోషకరమన్నారు. (Story:70 అడుగులకు వినుకొండ పట్టణ మెయిన్ రోడ్డు విస్తరణ)