భారత సైన్యం అసమాన పోరాట పటిమకు ప్రతీక ఆపరేషన్ సిందూర్: జీవీ
న్యూస్ తెలుగు /వినుకొండ :భారత సైన్యం అసమాన పోరాట పటిమకు ప్రతీక ఆపరేషన్ సిందూర్ అని ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు కొనియాడారు. ఈ సైనిక చర్య ద్వారా త్రివిధ దళాలు ప్రదర్శించిన అసాధారణ ధైర్యసాహసాలు, సమర్థత, నిబద్ధతను హృదయపూర్వకంగా అభినందిస్తున్నట్లు తెలిపారు. ఈ ఆపరేషన్, దేశ భద్రతను కాపాడేందుకు, శాశ్వతంగా ఉగ్రవాద పీడను వదిలించేందుకు చేపట్టిన అత్యంత కీలకమైన చర్యగా అభివర్ణించారు. బుధవారం ఒక పత్రిక ప్రకటనలో తెలిపారు . భారత సైనికుల అచంచలమైన దేశభక్తి, యుద్ధసన్నద్ధత గురించి మాటల్లో వర్ణింలేమన్నారు. ఇదే సమయంలో ఆపరేషన్ సిందూర్ ద్వారా, భారత సైన్యం శత్రువులకు గట్టి హెచ్చరిక జారీ చేసినట్లైందన్నారు. భారత దేశ సార్వభౌమత్వంపై ఎవరూ కన్నెత్తి చూడలేరని, ఎక్కడైనా దాక్కున్న ఉగ్రవాదులను వెలికితీసి నిర్మూలించే సామర్థ్యం మన సైన్యానికి ఉందని ఈ దాడితో రుజువు చేశారన్నారు. ఈ ఆపరేషన్ దేశ ప్రజలలో ధైర్యం నింపడమే కాక, అంతర్జాతీయ సమాజంలో భారతదేశ శక్తిని మరింత బలోపేతం చేసిందన్నారు. ఈ సందర్భంగానే త్రివిధ దళాధిపతులకు, రాజకీయ నాయకత్వానికి అభినందనలు తెలియజేశారు. ఈ ఆపరేషన్ విజయవంతం కావడానికి దిశానిర్దేశం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఆయన దూరదృష్టి, స్థిరమైన నాయకత్వం, దేశ భద్రత పట్ల నిబద్ధత ఈ విజయానికి మూలాధారమన్నారు. ప్రధాన మంత్రి మోదీ నాయకత్వంలో, భారత్ శక్తివంతమైన శక్తిగా ఎదుగుతోందని ఆపరేషన్ సిందూర్ మరోసారి నిరూపించిందన్నారు. (Story:భారత సైన్యం అసమాన పోరాట పటిమకు ప్రతీక ఆపరేషన్ సిందూర్: జీవీ)