బాధితులకు పెన్షన్లు ఇవ్వకపోతే ధర్నా చేపడతాం
మాజీ ఎమ్మెల్యే బొల్లా
న్యూస్ తెలుగు/వినుకొండ : శావల్యాపురం మండలం, పొట్లూరు, కొత్తలూరు, పిచ్చుకలపాలెం, గ్రామాలకు చెందిన అర్హులైన పేదలకు పెన్షన్లు ఇవ్వకుండా నిలిపివేశారని మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అధికారులపై ఆగ్రహించారు. ఆదివారం వినుకొండ వైసీపీ కార్యాలయంలో శావల్యాపురం మండలం వైసిపి నేతలతో కలిసి విలేకరుల సమావేశం లో మాట్లాడారు. శావల్యాపురం మండలంలో కొందరు తిరునాళ్ల సందర్భంగా వైసీపీ వర్గానికి చెందిన కొందరు ఎలక్ట్రిక్ ప్రభలు కట్టారన్న అక్కసుతో టిడిపి నేతలు అధికారులను బెదిరించి పై మూడు గ్రామాల అర్హులైన పేదలకు పెన్షన్లు ఇవ్వకుండా అడ్డుకోవడంతో శనివారం మండల పరిషత్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టడం జరిగిందన్నారు. చివరకు అధికారులు రెండు రోజుల్లో పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగిందని, సోమవారం సాయంత్రం లోపల పెన్షన్లు ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ప్రజలను, బాధితులను సమీకరించి వినుకొండ శివయ్య స్తూపం సెంటర్లో భారీ ఎత్తున ధర్నా నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.. అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పడి పది మాసాలు దాటినప్పటికీ వినుకొండలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేపట్టలేదు అన్నారు. రైతు పండించిన ధాన్యానికి, పత్తికి, మిర్చికి ధర లేకుండా పోయిందని, ఆర్.బి.కె కేంద్రాల్లో కొనే నాధుడే లేకుండా పోయారని, కూటమి ప్రభుత్వం అధికార దాహంతో వైసిపి వర్గీయులకు పెన్షన్లు, సంక్షేమ పథకాలు రాకుండా అడ్డుకుంటున్నారని ఆయన విమర్శించారు. నియోజకవర్గంలో జరిగే టిడిపి నేతల వికృత చేష్టలు క్యాబినెట్ హోదా కలిగిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులకు తెలియ రాలేదా అని ప్రశ్నించారు. అలాగే సింహాచలంలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా గోడ నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు లోపించి రెండవ తేదీ గోడ కూలి ఏడుగురు చనిపోవడం జరిగిందని ఇది ప్రభుత్వ తప్పిదం అన్నారు. ఈనెల 2వ తేదీ అమరావతిలో జరిగిన ప్రధాని మోడీ సభ ఒకరిని ఒకరు పొగుడుకోవటంతోనే సరిపోయిందని, 29 గ్రామాల ప్రజలు అమరావతికి భూములు ఇచ్చారని చెప్పిందే చెబుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు మరల పెద్ద ఎత్తున భూములుహస్త గతం చేసుకునేందుకు చంద్రబాబు తాపత్రయం పడుతున్నాడని బ్రహ్మనాయుడు విమర్శించారు. వైసిపి అధికార ప్రతినిధి ఎం.ఎన్. ప్రసాద్ మాట్లాడుతూ. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి రెడ్ బుక్ పాలన జరుగుతుందని, కేవలం ప్రభలు కట్టిన అందుకే వైసీపీ వర్గీయులు మూడు గ్రామాల పేదల పెన్షన్లు ఆపటం అవివేకం అన్నారు. గత వైసిపి ప్రభుత్వం 64 లక్షల పెన్షన్లు అందజేస్తే నేటి ప్రభుత్వం ఆ పెన్షన్లు కుదించడం జరిగిందన్నారు. మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వినుకొండ మండలంలోని ఏనుగుపాలెం గ్రామంలో మహిళపై హత్యాచారం జరిపి పది మాసాలు గడుస్తున్న నిందితులను పోలీసులు పట్టుకోలేదన్నారు. మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ అమ్మిరెడ్డి అంజిరెడ్డి మాట్లాడుతూ. అమరావతి ప్రధాని సభలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి గానీ, ప్రత్యేక హోదా గురించి గానీ మన పెద్దలు ప్రధానికి వివరించలేదు అన్నారు. సభకు వందల కోట్లు ఖర్చు పెట్టారే గాని సంక్షేమ పథకాలపై మాట్లాడలేదన్నారు.(Story : బాధితులకు పెన్షన్లు ఇవ్వకపోతే ధర్నా చేపడతాం )

