సమయానికి ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి
న్యూస్ తెలుగు /వనపర్తి : పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు పరీక్షలు ప్రారంభమయ్యే సమయానికి ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. శుక్రవారం ఉదయం 9.30 నుండి వనపర్తి జిల్లాలోని 36 కేంద్రాల్లో పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కాగా జిల్లా కలక్టర్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, బాలుర ఉన్నత పాఠశాలలను సందర్శించారు. పోలీస్ బందోబస్తు, ప్రాథమిక తాత్కాలిక వైద్య కేంద్రం, విద్యార్థులకు తాగు నీరు వంటి మౌలిక ఏర్పాట్లను పరిశీలించారు. ప్రశ్నా పత్రాలు తెరిచే సూపరింటెండెంట్ హాల్లో సి.సి. కెమెరా ఏర్పాటు చేశారా లేదా అని పరిశీలించారు. ఫ్లయింగ్ స్క్వాడ్, ఇన్విజిలేటర్ లతో సహా పరీక్ష కేంద్రంలో ఏ ఒక్కరికీ సెల్ ఫోన్ లోపలికి తీసుకువచ్చే అనుమతి లేదని చెప్పారు. ఎవరైనా సరే సెల్ ఫోన్ పరీక్ష కేంద్రం బయటనే ఉంచి రావాల్సి ఉంటుందని తెలియజేశారు. వనపర్తి జిల్లాలో 36 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 6853 మంది విద్యార్థులు పరీక్షలు రాయవలసి ఉండగా మొదటి రోజు 6842 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. 11మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు జిల్లా విద్యా శాఖ అధికారి తెలిపారు. డి. ఈ. ఒ మొహమ్మద్ అబ్దుల్ గని, స్థానిక తహసీల్దార్ రమేష్ రెడ్డి ఉన్నారు.(Story : సమయానికి ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి )

