తెలియదు..గుర్తులేదు..ఏమో..!
పోలీసుల విచారణలో వంశీ జవాబులివే!
వంశీ బెయిల్ కోసం వైఎస్ఆర్సీపీ ప్రయత్నాలు
విజయవాడ జైలుకు వల్లభనేని వంశీ
14 రోజుల రిమాండ్
నా భర్తకు ప్రాణహాని ఉంది: పంకజశ్రీ
న్యూస్ తెలుగు/అమరావతి: విజయవాడ కృష్ణలంక పోలీసుల విచారణలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ నేత వల్లభనేని వంశీమోహన్ నోరు విప్పలేదని సమాచారం. వారడిగిన ప్రతిప్రశ్నకూ ‘నాకు ఏమీ తెలియదు..గుర్తులేదు..అదా..ఏమో..’ అని బదులిచ్చినట్లు తెలిసింది. బెదిరింపులు, కిడ్నాప్ కేసులో పోలీసులు అరెస్టు చేసిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్కు విజయవాడ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు కిడ్నాప్ కేసుపై 14 రోజులు రిమాండ్ విధించింది. వంశీని పోలీసులు విజయవాడ హనుమాన్ పేటలోని సబ్ జైలుకు పంపారు. వంశీతోపాటు శివ రామకృష్ణ, నిమ్మ లక్ష్మీపతికి 14 రోజులపాటు రిమాండ్ విధించారు. జైలుకు వచ్చే ముందు సూర్యారావుపేట పోలీస్ స్టేషన్లో పోలీసులు వంశీ వేలి ముద్రలు, ఐరిష్ తీసుకున్నారు. బెదిరింపులు, కిడ్నాప్ కేసులో వంశీ అరెస్టు కోసం అదనపు డీసీపీ జి.రామకృష్ణ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం విజయవాడ నుంచి బుధవారం రాత్రి హైదరాబాద్లోని రాయదుర్గం బయలుదేరి వెళ్లి అరెస్టు చేసిన విషయం విదితమే. వీరు గురువారం ఉదయం 6.30 గంటలకు రాయదుర్గం పోలీస్ స్టేషన్కు వెళ్లారు. మైహోమ్ భూజా డి బ్లాక్లో 11వ అంతస్తులో ఉంటున్న వంశీ ఫ్లాట్ వద్దకు పోలీసులు చేరుకుని ‘సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి బెదిరించారనే ఆరోపణలతో మీపై పటమట పోలీసు స్టేషన్లో భారత న్యాయ సంహితలోని సెక్షన్లు 140(1), 308, 351(3) రెడ్విత్3(5)తోపాటు సెక్షన్ 3(2) ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదైందని వివరించి, క్రైమ్ నంబర్ 86/2025 కేసులో పోలీసులు వంశీని అరెస్టు చేశారు. అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ నుంచి విజయవాడకు వంశీని తీసుకొచ్చి…వివిధ పోలీస్స్టేషన్లు తిప్పుతూ..చివరకు కృష్ణలంక పోలీస్స్టేషన్లో పోలీసులు విచారించారు.
ఆ కేసే కొంపముంచింది!
2023లో గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసును నీరు గార్చేందుకు మాజీ ఎమ్మెల్యే, వివాదాస్పద వైసీపీ నేత వల్లభనేని వంశీ పన్నిన పథకం బెడిసికొట్టి, తిరిగి ఆయనకే చుట్టుకుంది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదు వాపస్ తీసుకునేలా తన సోదరుడు ముదునూరి సత్యవర్ధన్ను బెదిరించి, భయపెట్టారని… కిడ్నాప్ చేశారని కిరణ్ అనే యువకుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పటమట పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీకి చెందిన బీసీ, మైనారిటీ, దళిత నాయకులు రమాదేవి, సురేశ్ బాబు, ఫణికుమార్, షేక్ జానీ ఇదే అంశంపై చేసిన ఫిర్యాదుపై ఇంకో కేసు పెట్టారు. ఈ రెండు కేసుల్లో పోలీసులు వల్లభనేని వంశీని ప్రధాన నిందితుడిగా పేర్కొన్నారు. ఆయన ప్రధాన అనుచరులు కొమ్మా కోట్లు, రామకృష్ణ, నీరజ్ తదితరులను నిందితులుగా చేర్చారు. వల్లభనేని వంశీ నటోరియస్ క్రిమినల్. ఆయనకు చాలా నేర చరిత్ర ఉందని, చట్టం, న్యాయం అంటే లెక్కే లేదని, ఆయనపై 16 క్రిమినల్ కేసులు ఉన్నాయని పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పేర్కొనడం సంచలనం కలిగించింది. ఎట్టకేలకు వంశీ అరెస్టుతో టీడీపీలో ఆనందం నెలకొనగా..వైసీపీ శ్రేణులు నిరుత్సాహంలో పడ్డారు. వంశీని జైలుకు వెళ్లకుండా వైసీపీ లీగల్ సెల్, ఆ పార్టీ నేతలు చేసిన ప్రయత్నాలన్నీ బెడిసికొట్టాయి. తుదకు డీజీపీ హరీష్గుప్తాకు వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లిన వైఎస్ఆర్సీపీ నేతలకు చుక్కెదురైంది. ఈ పరిణామాలతో వంశీ బెయిల్ కోసం ఆ పార్టీ నేతలు తీవ్ర ప్రయత్నాలు మొదలు పెట్టారు. అటు వంశీ భార్య పంకజశ్రీ మీడియాతో మాట్లాడుతూ, తన భర్తకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. రాజకీయ కక్షతోనే కేసులు పెట్టారని ఆమె ఆరోపించారు. (Story: తెలియదు..గుర్తులేదు..ఏమో..!)
Follow the Stories:
ఇంటర్ విద్యార్థులకు పండుగలాంటి వార్త!