వేరుశనగ రైతుల ఇబ్బందులను
ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం
న్యూస్తెలుగు/వనపర్తి : జిల్లాలో వేరుశనగ రైతుల ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి చెప్పారు. బుధవారం చిట్యాల సమీపంలో ఉన్న వ్యవసాయ మార్కెట్ యార్డును కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. మార్కెట్ యార్డుకు నిత్యం ఎంతమంది రైతులు వేరుశనగ పంటను తీసుకొస్తున్నారు, వారికి ఏ విధమైన ధర లభిస్తుందని మార్కెటింగ్ అధికారిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. రైతులతో కలెక్టర్ మాట్లాడుతూ వేరుశనగ అమ్మకంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగారు. రైతులు బదులిస్తూ వాతావరణం అనుకూలించక ఈ ఏడాది వేరుశనగ నాణ్యత లోపించిందని బదులిచారు. అంతేకాకుండా తమకు మంచి ధర దక్కడం లేదని, తమ పంటకు మంచి ధర కల్పించి ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. గత ఏడాది వనపర్తి మార్కెట్ యార్డులో వేరుశనగకు మంచి ధర లభించిందని, అదే మాదిరి ఈ ఏడాది కూడా మంచి ధరకు కొనుగోలు చేస్తే తమకు మేలు జరుగుతుందని రైతులు కలెక్టర్ కు విన్నవించారు. కలెక్టర్ స్పందిస్తూ వేరుశనగ రైతుల ఇబ్బందులను, వారికి మంచి ధర కల్పించే అంశంపై ప్రభుత్వానికి నివేదిస్తామని చెప్పారు. వనపర్తి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, మార్కెటింగ్ అధికారి స్వరణ్ సింగ్, ఇతర అధికారులు, రైతులు, ట్రేడర్లు తదితరులు ఉన్నారు. (Story : వేరుశనగ రైతుల ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం)