వినుకొండలో ఆదివారం కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆత్మీయ సమావేశం
న్యూస్ తెలుగు / వినుకొండ : కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆలపాటి రాజేంద్రప్రసాద్ తో ఆదివారం వినుకొండలో ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నట్లు నియోజకవర్గ పరిశీలకుడు పంచుమర్తి భూపతిరావు తెలిపారు. ఆలపాటి విజయం కాంక్షిస్తూ సాయంత్రం 5 గంటలకు ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతుందన్నారు. ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకున్న పట్టభద్రులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చి ఈ సమావేశాన్ని జయప్రదం చేయాలని పంచుముర్తి భూపతిరావు కోరారు. ఈ మేరకు శనివారం వినుకొండ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూపతిరావు మాట్లాడుతూ. వినుకొండ నియోజకవర్గ పరిధిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం 14 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారని, ఒక్కో పోలింగ్ కేంద్రాలో ఇద్దరు చొప్పున 28 మంది ఏజెంట్లను నియమించినట్లు తెలిపారు. అదే విషయంపై నాయకులతో చర్చించామన్నారు. ఈ నెల 7న ఉదయం 11 గంటలకు గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్రప్రసాద్ నామినేషన్ దాఖలు చేయనున్నారని వెల్లడించారు. (Story : వినుకొండలో ఆదివారం కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆత్మీయ సమావేశం)