రాష్ట్ర అభివృద్ధి ప్రజల సంతోషమే కోరుకునేది
ముక్కోటి ఏకాదశి సందర్భంగా వినుకొండలో జీవీ, మక్కెన ప్రత్యేక పూజలు
న్యూస్ తెలుగు/వినుకొండ : పల్నాడు ప్రాంతం, రాష్ట్రం ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించాలని, ప్రజలు సంతోషంగా ఉండాలనే తాను ఎప్పుడూ ఆ భగవంతుడుని కోరుకుంటానని ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. ప్రజలందరూ బాగుండి మన సంస్కృతి, సంప్రదాయాలను ముందుకు తీసుకెళ్లాలన్నదే తన ప్రార్థనగా ఉంటుందన్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా శుక్రవారం వినుకొండ శ్రీనివాస్నగర్లోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో జీవీ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం తెల్లవారుజామునే ఆలయానికి వెళ్లి ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. పర్వదినం సందర్భంగా ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు జీవీ, మక్కెనకు స్వాగతం పలికారు. అర్చకులు వేదాశీర్వచనాలు పలికి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ప్రజలకు ముక్కోటి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జీవీ మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశి చాలా పవిత్రమైన, విశేషమైన రోజు అని, వేంకటేశ్వరస్వామిని ఉత్తర ద్వారం నుంచి దర్శించుకునే రోజు అని తెలిపారు. పర్వదినం రోజున స్వామిని దర్శించుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని, ఈ రోజు స్వామివారిని దర్శించుకుంటే విశేషంగా ఆశీస్సులు ఇస్తారని భక్తుల నమ్మకమని చెప్పారు. తిరుమల తిరుపతి దేవస్థానం సహా వైష్ణవాలయాల్లో విశేషంగా పూజలు జరుగుతున్నాయన్నారు. ఇక్కడికి భక్తులు భారీగా తరలివచ్చారని, వారందరి కోరికలు నెరవేరాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. వినుకొండ ప్రాంత అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి శక్తివంచన లేకుండా పాటుపడతానని తెలిపారు. ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని భగవంతుడిని ప్రార్థించినట్లు తెలిపారు.(Story : రాష్ట్ర అభివృద్ధి ప్రజల సంతోషమే కోరుకునేది )