వరి పంటలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి
పొలం పిలుస్తోంది కార్యక్రమం
డి.ఆర్.సి, డి.డి.ఏ శివ కుమారి మేడం ఏవో కె అంజిరెడ్డి
న్యూస్తెలుగు/వినుకొండ : మండలంలోని వ్యవసాయ మరియు అనుబంధ శాఖల ఆధ్వర్యంలో వినుకొండ నియోజకవర్గంలోని అందుగులపాడు, నీలగంగవరం గ్రామాల్లో ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమంను డి.ఆర్.సి, డి.డి.ఏ శివకుమారి వ్యవసాయ అధికారి కొంకాయల అంజిరెడ్డి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కంది, వరి, మిరప పంటలను క్షేత్ర సందర్శన చేసి, రైతులతో సమావేశం నిర్వహించారు. ఏవో మాట్లాడుతూ వరి పంటలో ఉల్లికోడు, పాముపొడ తెగులు ఉధృతి ఉన్నట్లు గమనించారు. ఉల్లికోడు వలన పిలక దశలో అంకురం ఉల్లికాడ వలె పొడుగాటి గొట్టంగా మారి బయటకు వస్తుందని, కంకి వెయ్యదు అని తెలిపారు. పిలక దశలో 5 శాతం ఉల్లిగొట్టాలు లేదా దుబ్బుకి 1 కోడు సోకిన పిలక ఉన్న తీవ్రత స్థాయిలో ఉన్నట్లే అని, ఉల్లికోడు పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉల్లికోడు నివారణకు నాటిన 10 నుంచి 15 రోజులలోపు ఎకరానికి కార్బోప్యురాన్ 3జి 10 కిలోల గుళికలు వాడాలని తెలిపారు. పొడ తెగులు ఆశించడం వలన ఆకులపై మచ్చలు పెద్దవై పాముపొడ మచ్చలుగా ఏర్పడి మొక్కలు పూర్తిగా ఎండిపోవడం జరుగుతుందని, ఈ తెగులు వెన్ను వరకు వ్యాపిస్తే రంగు మారిన లేదా తాలు గింజలు ఏర్పడి దిగుబడులు తగ్గుతాయి అని తెలిపారు. పాముపొడ తెగులు నివారణకు హెక్సాకొనజోల్ 2మి.లీ లేదా ప్రోపికొనజోల్ 1మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలని సూచించారు. అనంతరం రైతులకు ఖరీఫ్ సీజన్ కి సంబంధించి ఈ-పంట నమోదు ధ్రువీకరణ పత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వా పురుషోతం రెడ్డి , నారాయణ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. (Story : వరి పంటలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి)