ముగిసిన శ్రీమద్భగవద్గీత ప్రవచనం
న్యూస్తెలుగు/గుంటూరుః స్థానిక బృందావన్ గార్డెన్ శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం పద్మావతి కళ్యాణవేదికపై శుక్రవారం మాటూరి జగన్మోహనరావు, చెన్నలక్ష్మి దంపతులు సౌజన్యంతో గత నాలుగురోజుల నుంచి నిర్వహిస్తున్న‘‘శ్రీమద్భగవద్గీతలోని అక్షర బ్రహ్మయోగంపై ఆధ్యాత్మిక ప్రవచనం శుక్రవారం ముగిసింది. తొలుత ఆలయ అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. చిన్మయామిషన్ బ్రహ్మచారి సువీరానందస్వామి చిన్మయామిషన్ ప్రవచిస్తూ, శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునితో సకామకర్మయోగులను క్రమముగా అభిమాన దేవతలు స్వర్గాదిలోకములకు చేర్చుతారన్నారు. శుక్ల, కృష్ణమార్గములు అని ఈ రెండు మార్గములు వ్యవహార ప్రసిద్ధి కలదన్నారు. దేవయాన మార్గమున వెళ్లువారు పరమగతిని పొంది తిరిగిరారన్నారు. పితృయాన మార్గమున వెళ్ళువారు తిరిగివచ్చి జననమరణచక్రములో పడతారన్నారు. ఈ తత్త్వ రహస్యమును తెలిసిన యోగి వేదపఠనము వలనను సనాతన పరమపదమును చేరుతారన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటి సభ్యులు సువీరానందస్వామిని ఘనంగా సత్కరించారు. (Story : ముగిసిన శ్రీమద్భగవద్గీత ప్రవచనం)
