మల్లు స్వరాజ్యం కన్నుమూత
హైదరాబాద్ : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యురాలు, మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం(92) అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆమె బంజారాహిల్స్లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుది శ్వాస విడిచారు. మల్లు స్వరాజ్యం అంత్యక్రియలు ఆదివారం నల్లగొండ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్నట్లు సిపిఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. మల్లు స్వరాజ్యం మృతిపట్ల సిపిఐ(ఎం) సంతాపం ప్రకటించింది. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. భూమికోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం తెలంగాణ ప్రాంత ప్రజల్ని సమీకరించి నైజాం సర్కార్, రజాకార్లకు వ్యతిరేకంగా తుపాకి పట్టి సాయుధ పోరాటంలో ధైర్యసాహసాలతో పోరాడిన కామ్రేడ్ మల్లు స్వరాజ్యం కష్టజీవుల హక్కులకోసం కడదాక ఉద్యమించారు. ఉమ్మడి రాష్ట్రంలో మహిళా హక్కులతో పాటు శ్రామిక మహిళా ఉద్యమాలు, ముఖ్యంగా సారా వ్యతిరేక పోరాటంలో క్రియాశీలక పాత్ర పోషించారు. సిపిఎం కేంద్ర కమిటీ సభ్యురాలిగా, ఎంఎల్ఏగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. నమ్మిన ఆశయాల కోసం ఎర్రజెండా బాటలో అహర్నిశలు శ్రమించిన ఉద్యమ నేత మృతి కార్మిక వర్గానికి తీరని లోటు. ఎంతోమంది ప్రగతిశీలమహిళలకు ఆమె స్ఫూర్తిగా నిలిచారు. (Story: మల్లు స్వరాజ్యం కన్నుమూత)
See Also: దుబాయ్లో రాజమౌళి ఏమన్నారంటే…!