రెడ్ అలెర్ట్! వదలని వాన..ఆగని వరద!
న్యూస్తెలుగు/అమరావతి: ఆంధ్రప్రదేశ్లో వానలు ఆగడం లేదు. విజయవాడలో వరదలు తగ్గడం లేదు. ప్రస్తుతం ఏపీలో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీగా వానలు పడకపోయినప్పటికీ, ముసురుపట్టింది. అయితే రానున్న 24 గంటల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా కోస్తా జిల్లాలు వర్షాలకు ఇబ్బంది పడనున్నాయి. అల్లూరి సీతారామ రాజు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆయా జిల్లాల్లో అతిభారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, కృష్ణా జిల్లాకు ఆరంజ్ అలర్ట్ చేసింది. ఆయా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని.. ఒకటి లేదా రెండు చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం లేకపోలేదన్నారు. రానున్న రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తున్నందున తీర ప్రాంత ప్రజలను అప్రమత్తంగా ఉండాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్ కర్ పుండ్కర్ హెచ్చరించారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూంను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ పుండ్కర్ ప్రకటించారు, వరద నీటిలో చిక్కుకున్న వారు లేదా అత్యవసర పరిస్థితులను ఎదుర్కొంటే స్థానిక అధికారులను 08942-240557 నంబర్లో సంప్రదించాలని కోరారు.
ఇదిలాఉండగా, విజయవాడలో వరద తగ్గుముఖం పట్టినప్పటికీ, ఎగువ నుంచి వస్తున్న వరద భయపెడుతోంది. మళ్లీ బుడమేరు నీటి మట్టం పెరిగే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. ఇంకా పలు కాలనీలు ముంపులోనే ఉన్నాయి. ప్రభుత్వ సహాయక చర్యలు మాత్రం నిరంతరాయంగా కొనసాగుతూనే ఉన్నాయి.
మరోవైపు గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణశాఖ.. ఆయా జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. సోమవారం కూడా శ్రీకాకుళం నుంచి ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల వరకు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీయడం వల్ల సముద్రం అల్లకల్లోలంగా మారుతుందన్నారు. ఈనెల 11 వరకూ మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచిస్తున్నారు విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు.
ప్రకాశం బ్యారేజీ వద్ద ఇన్ఫ్లో పెరిగే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఏపి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆర్గనైజేషన్ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ మాట్లాడుతూ, భారీ వర్షాల కారణంగా వివిధ ప్రాజెక్టులలో గణనీయంగా వరదనీరు చేరుతుంది అన్నారు. శ్రీశైలం డ్యామ్లో ఇన్ఫ్లో 2.86 లక్షల క్యూసెక్కులు ఉండగా, ఔట్ఫ్లో 3.09 లక్షల క్యూసెక్కులుగా ఉందని ఆయన వివరించారు. నాగార్జున సాగర్ ఇన్ ఫ్లో 2.99 లక్షల క్యూసెక్కులుగా ఉంది. పులిచింతలలో 2.75 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా… 2.97 లక్షల క్యూసెక్కుల ఔట్ ఫ్లో ఉంది. ఈ పరిస్థితుల దృష్ట్యా, లోతట్టు ప్రాంతాలు, వాగులు, వంకల సమీపంలోని నివాసితులు ఓవర్ఫ్లో ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని కూర్మనాథ్ హెచ్చరిక జారీ చేశారు.
అటు విజయనగరం జిల్లావ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రేగిడి మండలం సాయన్న గెడ్డ వాగుకు వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. జగదిగ్భదంలో చిక్కుకుంది రేగడి విలేజ్. పలు ప్రభుత్వ కార్యాలయాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అంగన్వాడీ, హైస్కూల్, పశువైద్యశాలలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దీంతో రేగడికి రాకపోకలు బంద్ అయ్యాయి.
అటు అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల వాగులు, గెడ్డలు పొంగిపొర్లుతున్నాయి. చింతపల్లి మండలం కొత్తవీధిలో కాలువ పొంగింది. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. (Story: రెడ్ అలెర్ట్! వదలని వాన..ఆగని వరద!)
See Also:
దారుణం: పట్టపగలే ఫుట్ పాత్ పై రేప్ చేశారు!
బెజవాడలో మళ్లీ పెరిగిన వరద!
మీకు వెన్నునొప్పి, మెడ నొప్పి ఉందా? వాటికి కారణం ఇదే!
డెంగ్యూను అడ్డుకోవచ్చు…ఎలా అంటే? ఓ కన్నేయండి!
విజయవాడ వరదలు: బుడమేరు ఏరియల్ వ్యూ (ప్రస్తుత పరిస్థితి) l Full Video l Vijayawada Floods