జీరో వేస్ట్’ ప్రాంగణాలుగా రూపొందాలి….
మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ సిద్ద లింగమూర్తి…
గిరిజన గురుకుల పాఠశాలలో ‘స్వచ్ఛ సర్వేక్షన్’ సదస్సు….
న్యూస్ తెలుగు/వినుకొండ : వినుకొండలోని ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో గురువారం ‘స్వచ్ఛ సర్వేక్షన్ 2025-26’ అవగాహన సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన పురపాలక సంఘం స్పెషల్ ఆఫీసర్ సిద్ద లింగమూర్తి మాట్లాడుతూ.. ప్రతి ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, హాస్టళ్లలో ఉత్పన్నమయ్యే కిచెన్ వ్యర్థాలను బయటకు పంపకుండా, అక్కడే ఎరువుగా మార్చుకుని ‘జీరో వేస్ట్’ ప్రాంగణాలుగా మారాలని పిలుపునిచ్చారు. నిబంధనలు పాటించే ఉత్తమ సంస్థలకు పురస్కారాలు అందిస్తామన్నారు.
మున్సిపల్ కమిషనర్ శివరామ ప్రసాద్ మాట్లాడుతూ.. చెత్తను తడి, పొడి, హానికర వ్యర్థాలుగా వేరు చేయాలని, వినుకొండను ప్లాస్టిక్ రహిత పట్టణంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం వారితో ‘స్వచ్ఛ ప్రతిజ్ఞ’ చేయించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్, ఏఐఐఎల్ఎస్జీ కోఆర్డినేటర్ శివ పార్వతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.(Story : జీరో వేస్ట్’ ప్రాంగణాలుగా రూపొందాలి….)

