గ్రామీణ ప్రాంతాల అభివృద్దే ప్రజా ప్రభుత్వ లక్ష్యం
మంత్రి జూపల్లి కృష్ణారావు
న్యూస్ తెలుగు/వనపర్తి : గ్రామీణ ప్రాంతాల అభివృద్దే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, ఇందుకోసం ప్రజలకు ఎల్లప్పుడూ తన సహకారం ఉంటుందని రాష్ట్ర అబ్కారి, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.ఆదివారం వీపనగండ్ల మండల కేంద్రంలో పర్యటించిన మంత్రి జూపల్లి కృష్ణారావు వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్యా నాయక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవర్ధన్ సాగర్ తో కలిసి వీపనగండ్ల మండల కేంద్రం నుంచి బెక్కం గ్రామానికి రూ. 3.90 కోట్లతో నిర్మించనున్న బీటీ రహదారికి మంత్రి శంకుస్థాపన చేశారు.శంకుస్థాపన అనంతరం మంత్రి మాట్లాడుతూ వీపనగండ్ల మండల కేంద్రం నుంచి బెక్కెం వరకు నిర్మించనున్న బీటీ రహదారిని నాణ్యతతో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందంజలో నిలపడమే లక్ష్యమని తెలిపారు. గతంలో తాను పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నియోజిక వర్గం లో రూ. 300 కోట్లతో సిసి రహదారులు, రూ. 600 కోట్లతో బీటీ రహదారులు నిర్మించే అభివృద్ధి చేసినట్లు గుర్తు చేశారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా తన సహకారం ఉంటుందని చెప్పారు. మండల పరిధిలో నాలుగు ఎకరాల భూమిలో స్పోర్ట్స్ కోసం స్టేడియాన్ని ఏర్పాటు చేయించేందుకు అన్ని రకాలుగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఆర్డీవో సుబ్రహ్మణ్యం, పంచాయతీరాజ్ కార్యనిర్వాహక ఇంజనీర్ మల్లయ్య, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి శ్రీనివాసులు, ఇంజనీరింగ్ అధికారులు, మండల తహసిల్దార్, ఎంపీడీవో, ఇతర మండల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.(Story : గ్రామీణ ప్రాంతాల అభివృద్దే ప్రజా ప్రభుత్వ లక్ష్యం )

