PDSU 4వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయండి
న్యూస్తెలుగు/వనపర్తి : వనపర్తి పట్టణంలోని PDSU జిల్లా కార్యాలయంలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU) రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని రాష్ట్ర అధ్యక్షుడు ఎం వెంకటరెడ్డి అధ్యక్షతన నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం వెంకటరెడ్డి, ఎ సాంబ లు మాట్లాడారు దేశ స్వాతంత్రం కొరకు బ్రిటిష్ వ్యతిరేక పోరాటంలో అమరులైన జాతీయ ఉద్యమ అమరుల స్ఫూర్తి, తెలంగాణ, నగ్జల్బరీ, శ్రీకాకుళ, గోదావరిలోయ రైతంగా పోరాటాల ప్రేరణతో, సామ్రాజ్యవాద వ్యతిరేక చిహ్నం చేగువేరా స్ఫూర్తితో తెలుగు నేలపై ఐదు దశాబ్దాల క్రితం ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా పురుడోసుకున్న ప్రగతిశీల విద్యార్థి ఉద్యమం శాస్త్రీయ విద్యా సాధనే లక్ష్యంతో, సమసమాజ స్థాపనకై పోరాడుతూ అమరులైన ఎందరో విద్యార్థి అమరవీరుల తెగువతో విద్యార్థి లోకంలో తిరుగులేని శక్తిగా నిలిచింది. విద్యారంగ సమస్యలపై రాజీలేని ఉద్యమాలను నిర్వహిస్తూ, సమాజంలో ఉన్న వివక్షతలపై జరిగిన, జరుగుతున్న పోరాటాల్లో భాగస్వామ్యం అవుతూ వస్తుంది. ఇంతటి చరిత్ర కలిగిన PDSU తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలను వనపర్తి జిల్లా కేంద్రంలో అక్టోబర్ 28, 29, 30 తేదీలలో నిర్వహించాలని PDSU తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం నిర్ణయించింది.
రాష్ట్రంలో విద్య వ్యవస్థ గాడి తప్పింది. ప్రభుత్వ విద్యా రంగంపై పాలకులు కనీస దృష్టి సారించడం లేదు. దీనివలన అందరికీ ఉచితంగా అందవలసిన విద్య కొందరికి కూడా అందడం లేదు. ప్రభుత్వ విద్యాసంస్థలు సమస్యలకు నిలయాలుగా మారాయి. వీటిని పరిష్కరించే నాధుడే కరువయ్యారు. ప్రభుత్వ విద్యాసంస్థల సమస్యలను ఆసరా చేసుకొని నాణ్యమైన విద్య పేరుతో ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యను వ్యాపార సరుకుగా చూస్తూ వేలల్లో, లక్షల రూపాయలను ఫీజులు, డొనేషన్ల పేరుతో వసూళ్లు చేస్తున్నారు. వీటిని నియంత్రణ చేయాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తున్నట్టు వ్యవహరిస్తూ ప్రైవేటు, కార్పోరేట్ విద్యాసంస్థలకు విచ్చలవిడిగా అనుమతులు ఇస్తూ వాటి అభివృద్ధికి పరోక్షంగా మద్దతిస్తున్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ సతీష్, ఆర్ రంజిత్, సహాయ కార్యదర్శులు కే గణేష్, కే పవన్ రాష్ట్ర నాయకులు జే గణేష్, బి వంశీ, సాంబ తదితరులు పాల్గొన్నారు. (Story: PDSU 4వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయండి)

