పులివెందుల గెలుపు ప్రజల బహుమతి
వైసీపీ గెలిస్తే వీరత్వం, ఓడితే ప్రజాస్వామ్యం లేదనడం జగన్ దివాళకోరుతనానికి నిదర్శనం
జగన్ చంద్రబాబును విమర్శించడం కాదు, పార్టీ దుకాణం మూసుకుని తీర్థయాత్రలకు పోతే బెటర్: జీవీ
న్యూస్ తెలుగు/ వినుకొండ : ఆంధ్రప్రదేశ్లో ఏడాది కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సుపరిపాలనకు ప్రజల చూపించిన నమ్మకం, వారిచ్చిన బహుమతే పులివెందులలో చారిత్రాత్మక విజయం అని ప్రభుత్వ చీఫ్విప్, స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. అంతే గాక చరిత్రలో తొలిసారిగా జగన్ రెడ్డి కుటుంబానికి పెట్టని కోటగా భావించిన పులివెందులలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మారెడ్డి లత ఘన విజయం సాధించడం ప్రజాస్వామ్య పునరుజ్జీవనానికి నిదర్శనంగా పేర్కొన్నారు. గురువారం ఈ మేరకు ప్రభుత్వ చీఫ్విప్ జీవీ ఆంజనేయులు ఒక ప్రకటన లో తెలిపారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరఫున విజయం సాధించిన లతారెడ్డికి అభినందనలు తెలిపిన ఆయన వైకాపాకు 685 ఓట్లు మాత్రమే రావడం, డిపాజిట్ కూడా కోల్పోవడం, జగన్ రెడ్డి, వైకాపా స్వయంకృతం అన్నారు. దశాబ్దాల తర్వాత పులివెందులలో ఓటర్లకు రిగ్గింగ్, బెదిరింపుల భయం లేకుండా, స్వేచ్ఛగా ఓటు వేయగల వాతావరణం కలగడంతోనే ప్రజాస్వామ్యానికి ఈ విజయం లభించినట్లు భావిస్తున్నామన్నారు. తాము కూడా వైకాపా తరహాలో మేము రాజకీయాలు చేసి ఉంటే, 11 మంది అభ్యర్థులు పోటీలోనే నిలిచి ఉండేవారా అని జగన్ను ఉద్ధేశించి ప్రశ్నించారు. నిజానికి ఒంటిమిట్ట, పులివెందులలో ఓటమి ఖాయమని తెలిసి కారణాలు వెతకడం, ప్రజలను తప్పుపట్టడం అనేది ఓడిపోయిన జగన్ విపరీత మానసిక స్థితికి ఉదాహరణగానే కనిపిస్తోందన్నారు. గెలిచినప్పుడు వీరత్వం, ఓడిపోయినప్పుడు ప్రజాస్వామ్యం లేదనడం జగన్ దివాళా రాజకీయాలు కాక మరేంటని చురకలు వేశారు. అన్నింటికంటే మించి జగన్ చంద్రబాబును విమర్శించడంతో పాటు రాజకీయాలే మానేసి పార్టీ మూసుకుని తీర్థయాత్రలకు వెళ్ళడం మంచిదని ఎద్దేవా చేశారు. కేంద్ర బలగాలు కాదు, అంతర్జాతీయ బలగాలు పెట్టినా, చచ్చిన వైకాపాను మళ్ళీ లేపడం అసాధ్యమన్న జీవీ గతంలోనే వైకాపా గెలిచినప్పుడు, కుప్పం మున్సిపాల్టీని కైవసం చేసుకున్నప్పుడు జగన్ అలానే చేశారని తూర్పారబట్టారు. ఒక్కమాటలో చెప్పాలంటే పులివెందులలోనే జగన్ పతనం మొదలైందని, లోకేష్ నాయకత్వంలోని తెలుగుదేశం దూకుడుకు కూడా ఈ ఫలితాలు అద్ధం పడుతున్నాయన్నారు. పులివెందుల ప్రజలు, కూటమి కార్యకర్తలు, మద్దతుదారులకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. (Story: పులివెందుల గెలుపు ప్రజల బహుమతి)

