శ్రమజీవుల పక్షపాతి సిపిఐ : రమేశ్
న్యూస్తెలుగు/ వనపర్తి : సిపిఐ శ్రమజీవుల పక్షపాతి అని సిపిఐ వనపర్తి నియోజకవర్గ కార్యదర్శి రమేశ్, వనపర్తి పట్టణ సహాయ కార్యదర్శి గోపాలకృష్ణ అన్నారు. గోపాల్పేట సిపిఐ 16వ మండల మహాసభ గోపాలకృష్ణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. సిపిఐ వందేళ్లుగా శ్రమజీవుల దోపిడీకి వ్యతిరేకంగా, వారి సంక్షేమం అభివృద్ధి కోసం పోరాడుతోందన్నారు. రైతు రుణమాఫీ, గిట్టుబాటు ధర, రైతు భరోసా, పేదలకు ఇండ్లు, ఇళ్ల స్థలాలు, కార్మికులకు కనీస వేతనం, నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం, కూలీలకు కష్టానికి తగిన కూలి కోసం పోరాటం చేస్తుందన్నారు. బూర్జువ పార్టీలు తమకు పదవులు అధికారం స్వలాభం ఆస్తులు పెంచుకునేందుకు పనిచేస్తాయన్నారు. కమ్యూనిస్టులు మాత్రమే నిస్వార్ధంగా పేదల సంక్షేమం అభివృద్ధి హక్కుల కోసం పోరాడుతాయన్నారు. అధికారం ఉన్న లేకపోయినా సిపిఐ ప్రజల మధ్యనే ఉంటుందని ప్రజల కోసం పనిచేస్తుందన్నారు. అధికారం ముఖ్యం కాకుండా ప్రజల ప్రయోజనాలే సిపిఐ కి ముఖ్యమన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బలమున్న అన్నిచోట్ల సిపిఐ పోటీ చేయాలన్నారు. బీజేపీ దేశ ప్రభుత్వం. బిజెపి ప్రభుత్వం దేశ సంపదను ఆదాని, అంబానీ వంటి కొంతమంది సంపన్నులకు దోచిపెడుతోందని,సిపిఐ సంపద ప్రజలందరికీ సమానంగా దక్కాలని పోరాడుతోందన్నారు. బిజెపి, కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలన్నారు. మోదీ ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నారని,రైతుల ఖాతాల్లో 15 లక్షలు జమ చేస్తామని మాయ మాటలు చెప్పారని 11 ఏళ్లయినా అమలు చేయలేదన్నారు. రుణమాఫీ, రైతు భరోసా కొందరికి అందలేదన్నారు. ఖరీఫ్ సాగు మొదలైందని రైతులకు ఎరువులు మందులు విత్తనాలు అందుబాటులో ఉంచాలన్నారు. ప్రజా సమస్యల కోసం పోరాడుతున్న సిపిఐ ని గ్రామ గ్రామాన బలోపేతం చేసి ఆదరించాలన్నారు. సిపిఐ వనపర్తి పట్టణ సహాయ కార్యదర్శి గోపాలకృష్ణ, జిల్లా కార్యవర్గ సభ్యుడు జె. చంద్రయ్య, నాయకులు మంకలి శాంతయ్య, కురుమూర్తి, బుచ్చన్న, తాహర్నియా, రహీం, వి. కురుమయ్య, చిన్నయ్య, బండలయ్య, కావలి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.(Story:శ్రమజీవుల పక్షపాతి సిపిఐ : రమేశ్)

